మొన్న చప్పట్లకి.. ఇప్పుడు వేడికి చస్తాదంటున్నారు

by  |
మొన్న చప్పట్లకి.. ఇప్పుడు వేడికి చస్తాదంటున్నారు
X

సామాజిక మాధ్యమ వేదికలు, ఫేస్‌బుక్, వాట్స్‌యాప్ యూనవర్సిటీలో రోజుకో వార్త, విశేషం హల్‌చల్ చేస్తుంటాయి. అందులో శాస్త్రీయమైనవి కొన్నైతే.. అశాస్త్రీయమైనవి ఎన్నో ఉంటాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రధాని సూచించిన కృతజ్ఞతా సూచనలకు సామాజిక మాధ్యమాల్లో రకరకాల భాష్యాలు చెబుతున్నారు. వాటి వివరాల్లోకి వెళ్తే..

ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు వైద్యమందిస్తున్న వైద్యులకు సూచనగా గత నెల 22న సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు లేదా గంటలు కాకపోతే ప్లేట్లు చప్పుడు చేయాలని ప్రధాని సూచించారు. దానిని మతానికి లింకు పెడుతూ, ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత వంటి వారు.. ఆ సమయంలో గ్రహాలన్నీ ఒక రేఖలో ప్రవేశిస్తున్నాయని, ఆ సమయంలో శబ్దం చేస్తే ఆ చప్పుడుకి ఎలాంటి వైరస్ అయినా చనిపోతుందని, అందుకే వీలైనంత మంది శబ్దం చేయాలని పిలుపునిచ్చారు. వారు చెప్పినట్టు ఆ శబ్దానికి చావాల్సిన వైరస్ కాస్త పిచ్చెక్కినట్టు నలుదిశలా విస్తరించింది.

దేశంలో ఇప్పుడు కరోనా బారిన మూడు వేల మందికిపైగా పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన వారికి వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందికి మద్దతుగా రేపు అంటే ఏప్రిల్ 5న సాయంత్రం 9 గంటలకి 9 నిమిషాల పాటు లైట్లు ఆపి, దీపాలు, కొవ్వొత్తులు, లేదో మొబైల్ ఫోన్లలోని లైట్లు వేసి మద్దతు ప్రకటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. యూరోపియన్ దేశాల్లో కూడా కరోనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేశారు.దీనినే ప్రధాని సూచించారు. దీనిపై కూడా సోషల్ మీడియాలో సరికొత్త వాదన పుట్టుకొచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే…

లైట్లు కాంతినిస్తాయి. అలా కాకుండా దీపాలు లేదా కొవ్వొత్తులు వెలిగిస్తే.. ఆ కాంతితో పాటు వేడి పుట్టుకొస్తుంది. 130 కోట్ల మంది ఇలా దీపాలను వెలిగించడం వల్ల జనించే వేడికి కరోనా వైరస్ మరణిస్తుంది అంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. పురాత గ్రంధాల్లో ఇలాంటి ఘటనలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. దీనిపై హేతువాదులు ఛలోక్తులు విసురుతున్నారు. వేసవి కాలం ఆరంభమైంది. వేడి కూడా పెరుగుతోంది. ఈ వేడి కంటే కొవ్వొత్తుల వేడి దూరం ప్రయాణిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మీమ్స్ తయారు చేసే వారు.. మొన్న గంటలు కొట్టమన్నారు. ఇప్పుడు దీపం వెలిగించమంటున్నారు.. ఈ సారి తప్పకుండా ప్రసాదం పెడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

tags: social media, facebook, whats app, twitter, whats app university, fake propaganda, modi request, social media platforms

Next Story

Most Viewed