మొబైల్‌ ఫోన్‌లపై జీఎస్టీ తగ్గించాలని కోరిన పరిశ్రమ

by  |
మొబైల్‌ ఫోన్‌లపై జీఎస్టీ తగ్గించాలని కోరిన పరిశ్రమ
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్‌ఫోన్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని పరిశ్రమ సంఘం ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) కేంద్రాన్ని కోరుతోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో మొబైల్ పరిశ్రమకు భారంగా ఉన్న జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేసింది. విదేశాల నుంచి భారీగా మొబైల్‌ఫోన్‌లను దిగుమతి చేస్తున్న క్రమంలో దిగుమతి సుంకాలను పెంచడం సబబు కాదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది మార్చిలో పరిశ్రమను దారుణంగా దెబ్బ తీసేలా జీఎస్టీని 50 శాతం పెంచారని ఐసీఈఏ తెలిపింది.

‘ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాలనే లక్ష్యాన్ని సాధించేందుకు, రూ. 6 లక్షల కోట్ల దేశీయ మొబైల్‌ఫోన్ మార్కెట్‌గా మారేందుకు జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని’ ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ ఓ ప్రకటనలో చెప్పారు. రానున్న బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గించాలని, లేదంటే ఒక్కో మొబైల్‌పై రూ. 4,000 తగ్గింపును ఇవ్వాలని, రెండింటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని అమలు చేయాలని ఐసీఈఏ కోరింది. ఈ నిర్ణయం వల్ల దేశీయ మొబైల్ తయారీ రంగం పటిష్ఠమవుతుందని పేర్కొంది.



Next Story

Most Viewed