గజ్వేల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చక్రం తిప్పేది ఆయనేనా..?

by  |
trs leader
X

దిశ, గజ్వేల్ : గజ్వేల్ రాజకీయాల్లో రోజురోజుకూ రసవత్తర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధిష్టానం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి గజ్వేల్‌కు చెందిన డాక్టర్ యాదవ రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో అసలు కథ మొదలయ్యింది. అప్పటివరకు నేనే సర్వం అని ప్రకటించుకున్న నేతలకు ఈ విషయం మింగుడు పడనిదిగా మారిందట. అంతర్గతంగా ఇప్పటికే గజ్వేల్ తెరాసలో అగ్రనేతల గ్రూపులు రెండు వర్గాలుగా చీలిపోయాయట. పైకి మేమంతా ఒకటే అనేలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన లోన మాత్రం కాల కూట విషం నింపుకున్న చందంగా పరిస్థితులు మారాయట. ఇట్లాంటి క్రమంలో సొంత పార్టీ అభ్యర్థి భవితవ్యం ఏంటా అంటూ సరికొత్త పాలిట్రిక్స్ అంకానికి తెర తీసినట్టయ్యింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కథా కమామీషు ఏ దిశలో నడుస్తుందో ఓ లుక్కేందాం రండి..

వంటేరు యాదవ రెడ్డి సంఫూర్ణ రాజకీయ చతురుడిగా పేరొందిన నేత.. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే తత్వం అలవర్చుకున్న వ్యక్తి.. నమ్మకానికి కేరాఫ్‌గా నిలిచే నాయకుడు ఇదంతా ఒక వైపు మాత్రమే రాజకీయంగా గెలుపు వ్యూహలు పన్నడంలో కాకలు తీరిన యోధుడంటే అతిశయోక్తి కాదు. తెరాస పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి మరీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమే ఇందుకు ప్రత్యేక నిదర్శనం. ఇదిలావుంటే డాక్టర్ సాబ్ ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే గజ్వేల్లో కీలక నేతగా మారే అవకాశం ఉండటంతో యాదవ రెడ్డి ఓటమి కుట్రలకు తెరతీసినట్టు సొంత పార్టీలో ఓ వర్గం నేతలే బాహాటంగా వ్యాఖ్యానించడం చెప్పుకోదగ్గ అంశం. ఇప్పటివరకు గజ్వేల్ రాజకీయాలకు తానే కేంద్రం అని స్వప్రకటన చేసుకున్న ఓ నాయకుడికి మాత్రం రెడ్డికి ఎమ్మెల్సీ అంశం విుంగుడు పడటం లేదట. దీంతో డాక్టర్ సాబ్ ఓటమి మార్గాల అన్వేషణ ప్రారంభించాడట. ఈ విషయంపై గజ్వేల్‌కు చెందిన ఓ కీలక నేత యాదవ రెడ్డిపై ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న నాయకురాలి సన్నిహితుడితో రాజధానిలో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారని పుకార్లు గుప్పుమంటున్నాయి.

గజ్వేల్లో అంతా మాజీలే..

గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి ప్రజాప్రతినిధులందరూ మాజీలనే చెప్పుకోవాలి. గతంలో రాష్ర్ట స్థాయిలో కీలక పదవులు అనుభవించి గజ్వేల్ కీలక నేతలుగా పేర్కొన్న వారికి మరల పదవి అవకాశం ఇవ్వకపోవడంతో మాజీలుగానే మిగిలారు. మొదటి నుంచి తెరాసకే అంకితమయిన భూం రెడ్డికి, ఎలక్షన్ రెడ్డిలకు కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చి మరల వాటిని పొడగించకపోవడంతో పదవులకు దూరమయ్యారు.ఈ క్రమంలోనే మరో నేత భూపతి రెడ్డికి టూరిజం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి కొన్నాళ్ళు స్థానికంగా ఉంటూనే చక్రం తిప్పారు. ఇక నర్సారెడ్డి పరిస్థితి రాజు రానే వచ్చాడు వెళ్ళనే వెళ్ళాడులా మారింది. ఇటీవలే ఆకస్మికంగా తెరాసలో చేరి అనూహ్యంగా అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గిరిని చేపట్టి గజ్వేల్లో కింగ్ మేకర్‌గా మారిన వంటేరు ప్రతాప్ రెడ్డి పదవీ కాలం కోద్ది రోజుల క్రిందే ముగిసిపోయి తను మాజీగానే మారాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ సాబ్ ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే గజ్వేల్ కీలక నేతగా మారడమే కాకుండా ప్రోటోకాల్ కల్గిన స్థానిక మొదటి ప్రజాప్రతినిధిగా అవతరించనున్నాడు.
యాదవుడి గెలుపు వ్యూహం..

యాదవ రెడ్డి అంటేనే విజయం మార్క్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అనేది నానుడి. గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెట్టిన తన రాజకీయ ప్రస్థానాన్ని నాటి కాలంలోనే నియోజకవర్గంలోనే కీలకంగా ఉన్న గజ్వేల్ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ పదవీ చేపట్టడంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు జిల్లా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేల ఆశీస్సులు ఇప్పటికే పోందిన డాక్టర్ సాబ్ అధికార పార్టీ పై కాస్త గుస్సగా ఉన్న ఎంపీటీసీలను తనదైన శైలిలో ప్రత్యక్షం చేసుకునే పనిని అప్పుడే షురూ చేశాడు. ఈ నెల 26న నామినేషన్ల ఉపసంహరణలు ఉండగా, ఈ లోగానే రెబల్స్‌గా పోటీ చేస్తున్నవారిని శాంత పర్చి వారితో పాటు, ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశంపై ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వినికిడి.

తూర్పు వర్సెస్ వంటేరు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తెరాస అభ్యర్థికి దీటుగా ఏ పార్టీ అభ్యర్థి పోటీకి సిద్ధంగా లేరన్న అంశం ఓ దశలో ప్రచారం జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి తూర్పు నిర్మల హస్తం పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో తూర్పు వర్సెస్ వంటేరులా మారింది. రెబల్స్ మాట ఇక సరేసరి.. అయితే, హస్తం పార్టీ అభ్యర్థి నిర్మల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి కావడం తన ప్రభావం కూడా ఉమ్మడి జిల్లాపైన ఉంటుందని, ఈ క్రమంలోనే తెరాస పార్టీకి సంఖ్యా బలం దృష్యా అధికంగా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం వహించడం, అధికార పార్టీకే మద్దతుగా ప్రజా ప్రతినిధులుండటంతో గెలుపు అవకాశాలు తెరాస అభ్యర్థికే అధికంగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రఘునందనుడు ఎటు వైపు..

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటు వైపు మెుగ్గు చూపుతాడో అంటున్నారు రాజకీయ మేధావులు. దుబ్బాకలో స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కాలం నాటి పరిస్థితులు శత శాతం మారాయని గ్రామీణ ప్రజా ప్రతినిధులు కమలం వైపు మొగ్గు చూపుతూ క్రమ క్రమంగా కారు దిగారనే వార్తలు షికారు చేస్తున్నాయి. కమలం పార్టీ తరపున ఏ అభ్యర్థి నామినేషన్ వేయకపోవడం, తను సపోర్ట్ చేసే నాయకుడు ఎవరా? అంటూ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు ఉంటుందంటున్నారు విశ్లేషకులు. రఘునందన్‌ను ప్రత్యక్షం చేసుకునేందుకు ఆయా పార్టీల నేతలు మంత్రాగం షురూ చేసినట్లు వినికిడి. ఏది ఏమైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది ప్రజా ప్రతినిధులు ఓటర్లుండగా వారిలో అధిక శాతం అధికార పార్టీ వారే కావడంతో తెరాస అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ మేధావులు.

Next Story