నా భూమి కబ్జాకు ఎమ్మెల్సీ భర్త యత్నిస్తున్నారు

by  |
నా భూమి కబ్జాకు ఎమ్మెల్సీ భర్త యత్నిస్తున్నారు
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్ :
తన వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్సీ ఆకుల లలిత భర్త ఆకుల రాఘవేందర్ ప్రయత్నిస్తున్నట్లు ఓ మహిళ తెలిపింది. బాధితురాలి వివరాల ప్రకారం…మాక్లూర్ మండలం దాస్ నగర్ కు చెందిన బండారు శారద.. అదే గ్రామ శివారులో 2003లో సర్వే నంబర్ 507,508,510లో 18 గుంటల వ్యవసాయ భూమిని మనోహర్, గోపాల్ రెడ్డి నుండి కొనుగోలు చేసింది. ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు, రెవెన్యూ రికార్డులు ఆమె వద్ద ఉన్నాయి. కాగా ఆమె పొలం పక్కన సర్వేనంబర్లు 506, 510లలో పది ఎకరాల భూమిని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆకుల లలిత భర్త రాఘవేందర్ కొనుగోలు చేశారు. అందులో రోడ్డు వెడల్పులో భాగంగా ఒక ఎకరం భూమిని ఆయన కోల్పోయాడు. దీంతో ఆమె భూమిని కబ్జా చేసేందుకు 2018లో రాఘవేందర్ ప్రయత్నించారు. దీనిపై ప్రశ్నించినందుకు గూండాలను పంపి ఆమెపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేశారు. కాగా గత కొన్ని నెలలుగా మరో మారు ఆమె భూమిని కబ్జా చేసేందుకు ఆయన ప్రయత్నించాడు..అందుకోసం ఆమెపైకి గుండాలను పంపి దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో మరో మారు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కాగా ఈ విషయంలో ఎమ్మెల్సీ భర్త, అతని అనుచరుల నుంచి తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆమె తెలిపారు. రాజకీయ అండతో దౌర్జన్యంగా తన భూమిని లాక్కునే యత్నం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనీ, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె కోరారు.



Next Story

Most Viewed