వైసీపీలో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి

by  |
వైసీపీలో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆమె మండలి సమావేశానికి సైతం హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మున్నీసా కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం వైసీపీలో చేరారు. విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్ గా కూడా ఆమె పనిచేశారు. వైఎస్ జగన్ తో మొదటి నుంచి కలిసి పనిచేశారు. వైసీపీ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ఆమెకు గత ఏడాది ఎమ్మెల్సీగా సీఎం జగన్ అవకాశం కల్పించారు. మున్నీసా మృతిపట్ల వైసీపీ శ్రేణులు. కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు.

కరీమున్నీసా హఠాన్మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Next Story