పీక్‌లో విడదల రజని పబ్లిసిటీ పిచ్చి.. చివరకు గుడిని కూడా..

by  |
పీక్‌లో విడదల రజని పబ్లిసిటీ పిచ్చి.. చివరకు గుడిని కూడా..
X

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయాల్లో ఎదగాలంటే కేవలం ధన బలం, మందబలం మాత్రమే కాదు.. ప్రచారం కూడా కావాలి. ప్రజల నోట్లో ఎంతలా నానితే అంతలా వారికి క్రేజ్ వస్తున్నట్లు లెక్క. అందుకే ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు పబ్లిసిటీ కోసం ఒక టీంను ఏర్పాటు చేసుకుంటారు. అందుకే పబ్లిసిటీతో పొలిటికల్ లీడర్స్‌‌కు విడదీయరాని అనుబంధం ఉంది అంటారు. తమ గురించి ఎంత ప్రచారం చేసుకుంటే అంతలా ప్రజలకు చేరువ అవుతారని..అలాగే అధినేత దగ్గర కూడా మంచి మార్కులు సంపాదించుకోవచ్చని నేతలు భావిస్తుంటారు. అందుకే తమను తాము ఎలివేట్ చేసుకోవడానికి ఏ అవకాశం వచ్చినా దాన్ని వదులుకునేందుకు ఇష్టపడరు రాజకీయ నాయకులు. అయితే ఇటీవల కాలంలో ప్రచారం కోసం వైసీపీ నేతలు హద్దులు దాటుతున్నారు. ప్రచారం కోసం దేనిని వదలడం లేదు. సినీ పంచ్‌ డైలాగుల దగ్గర నుంచి అన్నింటినీ వాడేస్తున్నారు. అధినేత మెప్పుపొందేందుకో, లేకపోతే ప్రజల్లో తమ రేంజ్ ఇది అని నిరూపించుకునేందుకో తెలియదు గానీ నేతలు దేవుళ్లను సైతం వదలడం లేదు. గోవింద నామస్మరణ తప్ప మరే నామస్మరణ వినిపించకూడని తిరుమల కొండపైనే జగన్ నామస్మరణ చేశారు. తాజాగా దేవతమూర్తుల పక్కన, అందులోనూ ఆలయ ముఖద్వారంపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఫోటో ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. పబ్లిసిటీ పిచ్చికోసం వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ఆధ్యాత్మిక సంస్థలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పబ్లిసిటీ ఓ రేంజ్‌లో

విడదల రజని.. ఈ పేరు సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారిలో తెలియనివారంటూ ఎవరూ ఉండరు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ మెట్లెక్కారు. సోషల్ మీడియాపై ఈమెకు మంచి పట్టుంది. పబ్లిసిటీ కోసం ప్రత్యేకించి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారో ఏమో తెలియదుగానీ ఈమె ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో రజనీ ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని గుంటూరు జిల్లాలో పబ్లిక్ టాక్. అంతేకాదు ఏ అంశాన్ని ఎలా పబ్లిసిటీ కోసం వాడుకోవాలో ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంతా చెవులు కొరుక్కుంటారు. గుంటూరులో సీఎం జగన్ పర్యటనలో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏ ఫోటో చూసినా అందులో ఆమె ప్రత్యక్షమవ్వడంతో అంతా ఔరా అనుకున్నారట.

దేవతామూర్తుల పక్కన రజని ఫోటో

తాజాగా విడదల రజని ఓ వివాదంలో ఇరుక్కున్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా చిలకలూరిపేట గడియారం స్తంభం దగ్గర ఉన్న పోలేరమ్మ గుడివద్ద దేవునితో సమానంగా అమ్మవారి రూపాల మధ్య ఎమ్మెల్యే విడదల రజని దండం పెడుతున్న ఫోటోలతో ఫ్లెక్సీలు ఆలయ ముఖ ద్వారంపై ఏర్పాటు చేశారు. గతంలో ఆ ఫ్లెక్సీ స్థానంలో దుర్గమ్మ నవ రూపాలతో ఫ్లెక్సీ ఉండేది. అయితే ఈ దసరాకు వైసీపీ కార్యకర్తలు దేవతల పక్కన విడదల రజని ఫోటో పెట్టి ఫ్లెక్సీ వేయించారు. ఆ ఫ్లెక్సీని ఆలయ ముఖద్వారంపై పెట్టడం వివాదాస్పదంగా మారింది. ప్రచారానికి కూడా హద్దుంటుంది. దేవతల పక్కన ఎమ్మెల్యే ఫోటో ఏంటని కొందరు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు వెంటనే ఫ్లెక్సీ తొలగించేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీ మోత మోగిస్తోంది.

అలా మెుదలైంది..

తనను తాను ఎలివేట్ చేసుకోవ‌డానికి అందివచ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు విడదల రజని. గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు మ‌హానాడు స‌భ‌లో బాబును విపరీతంగా పోగ‌డ్తలతో ముంచెత్తి చంద్రబాబు మనసులో చోటు దక్కించుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నారు. డబ్బు, ధైర్యంతో పాటు మంచి చురుకుదనం, అందం రజని సొంతం. ఆ క్రమంలో ఆమె మాస్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. సీన్ కట్ చేస్తే అప్పటి వరకు నియోజకవర్గంలో వైసీపీ కోసం పాటుపడిన మర్రి రాజశేఖర్‌ను కాదని విడదల రజని టికెట్ సాధించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లెక్కారు. ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి ఆమె సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నారు.


Next Story

Most Viewed