‘కుర్చీ’ ఫైటింగ్.. ఒక్కడే నాయకుడు.. రెండు వర్గాలు

by  |
‘కుర్చీ’ ఫైటింగ్.. ఒక్కడే నాయకుడు.. రెండు వర్గాలు
X

దిశ, కురవి : ఒకే నాయకత్వంలో రెండు వర్గాలు ఏర్పడటంతో నారాయణపురం గ్రామ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఆగిపోయాయి. ఈ వ్యవహారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలంలోని నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల మండల వ్యాప్తంగా ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించగా నారాయణపురం గ్రామ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తమకంటే తమకు అధ్యక్ష పదవి వరించాలని ఇరు రెడ్యావర్గాలు లాబీయింగ్ చేశాయి. ఈ వ్యవహారం మరింత వేడెక్కడంతో మండల కమిటీ కొలిక్కి వచ్చేంత వరకు పెండింగ్ పెట్టింది.

దీంతో ఇరువర్గాలు నిరాశతో ఉండిపోయాయి. అయితే, రెండు వర్గాలు వద్దంటూ ఇరువర్గాలు కలిసి పనిచేసుకోవాలని మండల నాయకులు బుజ్జగిస్తున్నరాట. దీంతో సీనియర్ వర్గం, జూనియర్ వర్గాలుగా విడిపోయి తాము సూచించిన వ్యక్తికే గ్రామ పార్టీ అధ్యక్ష పదవి కేటాయించాలని భీష్మించుకు కూర్చున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు ఎన్నికలు నిర్వహించగా ఇక్కడ మాత్రం పెండింగ్‌లో ఉండటం ఒక వర్గం ఎమ్మెల్యే రెడ్యా వర్గంగా.. మరో కూటమి ఆయన తనయుడు రవిచంద్ర వర్గంగా మారిపోయారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అవన్నీ అటుంచితే.. గత సర్పంచ్ ఎన్నికల్లో వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థి నాయకులను సైతం ఒప్పించి ఆ ఎన్నికను ఏకగ్రీవం చేసిన ఘనత ఈ నాయకులదే. కానీ తర్వాత ఎక్కడ చెడిందో ఏమో కానీ, రెండు వర్గాలుగా విడిపోయి నువ్వా.. నేనా.. అన్న చందంగా సీన్ మారిపోయింది. ఇక సీనియర్ నాయకుల ప్రవేశంతో అసంతృప్తులు బుజ్జగింపులకు లొంగుతారో లేదో వేచి చూడాల్సిందే.

అయితే. ఈ ఎన్నిక నిర్వహించేలోగా ఒక వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు, త్వరలో డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుల సమక్షంలో చేరుతున్నట్లు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఒక వేళ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగితే అటు సత్యవతి రాథోడ్ తన వర్గం వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు కొనసాగుతాయని కొందరు అంటుంటే, మరికొందరు కాంగ్రెస్ పార్టీకే మూకుమ్మడిగా వెళ్తారని చర్చించుకుంటున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరు ఎటు వైపు ఉంటారో.. ఊడుతారో తెలీక గ్రామస్థాయి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Next Story

Most Viewed