బీజేపీ నూతన రాష్ట్ర కమిటీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి

by  |
బీజేపీ నూతన రాష్ట్ర కమిటీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి
X

దిశ, న్యూస్‌బ్యూరో: బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పుపై ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీలోనే తాను ఒంటరి అవుతున్నానని, ప్రాధాన్యతకు నోచుకోలేకపోతున్నానని, మరోసారి సైడ్‌లైన్ అవుతున్నానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపిన వాట్సాప్ మెసేజ్‌లో వాపోయారు. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నా రాష్ట్ర నూతన కమిటీ కూర్పుపై తన అభిప్రాయాన్నే తెలుసుకోలేదని పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు రెండుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, పార్టీ కోసం అంత కష్టపడినవారిలో ఒక్కరు కూడా రాష్ట్ర కమిటీలోకి రావడానికి అర్హత లేకపోయిందా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని డివిజన్ స్థాయిలో సైతం అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి కూడా తనకు అవకాశం లేకుండాపోయిందని వాపోయారు. రాష్ట్ర నాయకత్వం మారితే పార్టీలో మార్పులు వస్తాయని ఆశించానని, కానీ అలాంటిది కనిపించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీలో గ్రూపులకు తావులేకుండా ప్రతీ ఒక్కరూ గట్టిగా కృషి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.



Next Story