రాజీనామా చేయడానికి సిద్ధం.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by  |
MLA Komatireddy Rajagopal Reddy
X

దిశ, మునుగోడు: మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమే అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ఊరచెరువు గతవారం కురిసిన వర్షాలకు నిండుకోవడంతో చెరువుకట్టను ఎమ్మెల్యేను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ, జీఎంఆర్, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి ముంపునకు గురికాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కోసం మంత్రి జగదీశ్వర్ రెడ్డి వస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యేనైనా తనకి కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గం మాదిరిగానే మునుగోడు నియోజకవర్గాన్ని రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామంటే తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణలో కేవలం ఉప ఎన్నికలు ఉన్న చోటనే ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెడుతున్నారని, ఈటలను ఓడించడానికి కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

ఎంత మందికి ‘దళిత బంధు’ ఇస్తారో తెలుపాలని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో అదేవిధంగా ‘దళితబందు’ అందాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాచరిక కుటుంబ పాలన సాగుతోందని, త్వరలోనే దీనికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వ పథకాలను అమలు చేసే సమయంలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎద్దేవా చేశారు. ఇక నుంచైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గుర్తించి అధికార కార్యక్రమాలకు ఆహ్వానించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఇక్కడ కూడా కొత్త పథకాలను ప్రజలకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రామ్ నగర్ కాలనీకి చెందిన తోర్పునూరి ఉమారాణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి షైనికి రూ. 2 లక్షల ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ భద్రయ్య, మండలాధ్యక్షులు శ్రీనాథ్, కౌన్సిలర్లు సైదులు గౌడ్, మంజుల, విజయ, పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, నాయకులు వెంకటయ్య, గ్రామ సర్పంచులు జైకేసారం సర్పంచ్ సైదులు, ఖైతాపురం సర్పంచ్ యాదయ్య, నేలపట్ల సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అచ్చయ్య, లింగస్వామి, సాయిలు, వినయ్, యాదయ్య పాల్గొన్నారు.

Next Story

Most Viewed