సొంత పార్టీపై కోమటిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్

by  |
సొంత పార్టీపై కోమటిరెడ్డి సెన్సెషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ బలపడేందుకు అవకాశాలున్నా అధిష్టానం తప్పులతో చేజారిపోతుందంటూ, సొంత పార్టీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్​ పార్టీకి ప్రధాన స్థానం ఉందని, కానీ అధిష్ఠానం తప్పిదాల వల్లే పార్టీ బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తెలంగాణ రాజకీయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తెలంగాణ తొలి పీసీసీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అన్నీ తప్పిదాలే చేశారని, ఇప్పుడైనా సరైన విధంగా నిర్ణయం తీసుకుంటారనుకుంటే ఇంకా పాత తప్పులే చేస్తున్నారని మండిపడ్డారు.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు పీసీసీ చీఫ్‌ ఎంపికను ముడిపెట్టడం ఎందుకో వారికే తెలియాలని, దీంతో అధిష్ఠానం సొంతంగా నిర్ణయం తీసుకునే స్థితిలో లేదని తెలుస్తుందని విమర్శించారు. ఎక్కడెక్కడి నుంచే వచ్చే వారికి బాధ్యతలు అప్పగిస్తే ఏం తెలుసుకోలేరని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్న నేతలను అధిష్ఠానం గుర్తించడం లేదని మండిపడ్డారు. పార్టీ కోసం పని చేసేవారిని, ప్రజాబలం ఉండే వారిని గుర్తించాలని, కనీసం డిపాజిట్ రాని నేతలను రాష్ట్రంలో తిప్పితే ఏం లాభముంటుందని రాజగోపాల్​రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందని, కష్టపడే ప్రాణమిచ్చే కార్యకర్తలున్నారని, పార్టీ కోసం కష్టపడే నేతలను అధిష్ఠానం గుర్తించాలని, టీపీసీసీ చీఫ్​పై నిర్ణయం తీసుకోవాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు.


Next Story

Most Viewed