ప్రతిపక్షాల పీఠాలు కదులుతున్నాయి : బాల్క సుమన్

by  |
Balka-Suman
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే కేంద్రం నుంచి 50 వేల కోట్లు దళిత బంధుకు తీసుకురావాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధును అడ్డుకోవడానికే బీజేపీ కొన్ని సంఘాల నేతలతో అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దేశంలో దళితులు సగర్వంగా బతికే రోజులు రావాలని ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్ సంకల్పం బంగారు తెలంగాణ అని 18 శాతం ఉన్న దళితుల సంక్షేమం కోసమే దళిత బంధును ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలకు దళిత బంధుతో పీఠాలు కదిలిపోతున్నాయి అనే భావనతో అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. బీజేపీ భావజాలం దళిత వ్యతిరేకమని.. సమాజం నుంచి దళితులను వెలి వేసేందుకు మూల కారణమే బీజేపీ అని ధ్వజమెత్తారు. దళిత బంధు దేశ చరిత్రలో ఒక విప్లవ ఉద్యమమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దళిత బంధు కాకుండా వేరే దాంట్లో రాజకీయాలు చేయాలని సూచించారు.

దళిత బంధును అడ్డుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధును చూసి ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఇతర రాష్ట్రాలలో కూడా దళితులు ఉద్యమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు. ఆయనకు మాట్లాడడానికి ఏమీ లేకనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఈనెల 16న హుజురాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. దళితుల సంక్షేమం కోసం పాటు పడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed