విచిత్రం.. ఎస్సైల‌ దొంగతనం.. స్టేషన్‌లో ఫిర్యాదు

by  |
విచిత్రం.. ఎస్సైల‌ దొంగతనం.. స్టేషన్‌లో ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకోవాల్సిన ఇద్దరు ఎస్సైలపై దొంగతనం కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్న ఎస్సైకే ఇవ్వడం గమనార్హం.

ఇంతకీ ఏం జరిగిందంటే… రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు బెంద్రెం తిరుపతి రెడ్డిని ఏప్రిల్ 20న క్రై నెంబర్ 100/2021 లో అరెస్ట్ చేసి ఇల్లంతకుంట పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. సిరిసిల్ల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ బెంద్రెం తిరుపతి రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే, కోర్టుకు అఫిడవిట్‌తో పాటు పర్సనల్ బాండ్ పేపర్ ష్యూరిటీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బెంద్రెం తిరుపతి రెడ్డి కోర్టుకు అఫడవిట్‌తో పాటు పర్సనల్ బాండ్ పేపర్‌ను కోర్టుకు సమర్పించి బెయిల్‌పై విడుదల అయ్యారు.

తాను కోర్టుకు సమర్పించిన పర్సనల్ బాండ్ పేపర్‌ను దొంగలించిన ఇల్లంతకుంట ఎస్సై రఫిక్ ఖాన్, ప్రొబేషనరీ ఎస్సై దిలీప్‌లు దానిని నిజప్రతిగా చూపించారని బెంద్రెం తిరుపతి రెడ్డి ఆరోపించారు. కోర్టులో తాను సబ్మిట్ చేసిన బాండ్ పేపర్‌ను కోర్టు అనుమతి తీసుకోకుండా, సర్టిఫైడ్ కాపీ తీసుకోకుండా నిజప్రతిగా చూపించారన్నారు. ఈ పర్సనల్ బాండ్ పేపర్‌ను ఆధారంచేసుకున్న ఇల్లంతకుంట పోలీసులు 1932012, 194/2021, 106/2021, 66/2021లలో తనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. తాను కోర్టు ఆదేశాల మేరకు అందించిన పర్సనల్ బాండ్ పేపర్‌ను కోర్టు నుంచి దొంగలించి వేరే కేసులకు ఆ బాండ్ పేపర్‌ను అటాచ్ చేసిన ఎస్సై ఎండీ రఫిక్ ఖాన్, పీఎస్సై వి.దిలీప్ లపై దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.

దీనికితోడు సదరు ఎస్సైల మీద కంప్లైంట్ చేస్తూ.. ఆ ఫిర్యాదు లెటర్‌ను ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరైన పీఎస్సై దీలిప్‌ కుమార్‌కే ఇవ్వడం గమనార్హం. ఏది ఏమైనా నేరస్థులను పట్టుకుని చట్టానికి అప్పగించాల్సిన పోలీసు అధికారులనే నేరస్థులని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తిరుపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు ఇల్లంతకుంట పోలీసులు రిసిప్ట్ కూడా ఇవ్వడం గమనార్హం. అయితే పోలీసులు ఈ కేసును ఎలా చేధిస్తారోనన్నదే ఇప్పుడు అసలు ట్విస్ట్.


Next Story