బాలికను తల్లిని చేసిన ఓ ప్రజాప్రతినిధి.. డ్రైవర్‌ను ఇరికించేందుకు పక్కా స్కెచ్..!

by  |
బాలికను తల్లిని చేసిన ఓ ప్రజాప్రతినిధి.. డ్రైవర్‌ను ఇరికించేందుకు పక్కా స్కెచ్..!
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండల కేంద్రానికి చెందిన ప్రజా ప్రతినిధి ఇంట్లో పని చేస్తున్న మైనర్ (17) గర్భం దాల్చింది. అభంశుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేయగా ఆమె గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోంది. ప్రజా ప్రతినిధి అయి ఉండి మైనర్ బాలికను ఇంట్లో పనికి పెట్టుకోవడమే నేరం. అదిగాక బాలిక గర్భం దాల్చడం జిల్లాలో చర్చనీయంగా మారింది. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ ప్రజా ప్రతినిధి మరో యువకుడిని తెరపైకి తీసుకొచ్చి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాయికల్ మున్సిపల్ కేంద్రంలో ప్రస్తుతం బాలిక గర్భం దాల్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సోషల్ మీడియా కథనాలపై శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి బృందం గత నాలుగు, ఐదు రోజుల నుండి మండల కేంద్రంలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు.

గత నెల 24న బాలికను గుర్తించిన అధికారులు ఆస్పత్రికి తరలించి వివరాలు తెలుసుకునేలోపే ఆ ప్రజా ప్రతినిధి వర్గం బాలికను అక్కడినుండి వేరే ప్రదేశానికి తరలించారు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు జిల్లా ఎస్పీ దృష్టికి విషయం తీసుకెళ్లినట్టు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఆచూకీ గురించి వివరాలు సేకరించగా బాలిక గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. బాలికపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, జీసీపీవో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ల ఆధ్వర్యంలో బాలిక ఉందని తెలుస్తున్నది. బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబం ఆర్థికంగా వెనకబడి ఉండటం వల్లే ఆ బాలిక ప్రజా ప్రతినిధి ఇంట్లో పనికి చేరినట్లు సమాచారం. అయితే, ఆమెను శారీరకంగా వాడుకుని గర్భవతి చేశాడని పలు ఆరోపణలు వస్తున్నాయి. చేసిన తప్పును తన పలుకుబడి ద్వారా కుటుంబ సభ్యులను నోరు తెరవకుండా చేసి కేసు నుండి తప్పించుకునేందుకు ఆ ప్రజాప్రతినిధి మరో యువకుడిపై కేసు నమోదు చేయించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఆ ప్రజా ప్రతినిధి గుట్టు రట్టవుతుందని మహిళా సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

ప్రజాప్రతినిధి మాజీ డైవర్ అరవింద్‌ను అరెస్ట్..

బాలికపై అఘాయిత్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డ్రైవర్ అరవింద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రెస్‌మీట్‌లో అరవింద్ మాట్లాడుతూ.. తాను బాలికపై అఘాయిత్యం చేయలేదని, చేయని తప్పును తనపై వేయాలని చూస్తున్నారన్నాడు. తనను రక్షించాలని ప్రెస్‌మీట్‌లో బాధితుడు కోరాడు. ఓ ప్రజాప్రతినిధి వద్ద 9 నెలల కిందట డ్రైవర్‌గా పనిచేసి మానేశానని తెలిపాడు. మైనర్‌ విషయంలో ఎలాంటి తప్పు చేయకున్నా గత 10 రోజులగా ఆ ప్రజాప్రతినిధి నుండి బెదిరింపులు వస్తున్నాయని వివరించాడు. నేను తప్పు ఒప్పుకోకుంటే నన్ను, నా భార్యను ఇబ్బందులకు గురి చేస్తానని బెదిరించాడని, అందువల్లే భయపడి ఒప్పుకోవడంతో తనపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఆ ప్రతినిధి చేసిన తప్పు బయట పడితే శిక్ష పడుతుందనే భయంతో సదరు బాలికతో కావాలనే తన పేరు చెప్పిస్తున్నారని వాపోయాడు. తనకు రక్షణ కల్పించి అసలు నిందితులకు శిక్ష వేయాలని వేడుకుంటున్నట్లు అరవింద్ వాపోయాడు. అవసరమైతే డీఎన్‌ఏ టెస్ట్‌కు కూడా తాను సిద్ధమని చెప్పాడు. మైనర్ బాలికకు జరిగిన అన్యాయంపై కులసంఘాలు పోరాటం చేయాలని, అసలు నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed