తెలంగాణ జాతి పోడా కోడె ప్రతిమ ఆవిష్కరణ

by  |
తెలంగాణ జాతి పోడా కోడె ప్రతిమ ఆవిష్కరణ
X

దిశ, న్యూస్‌ బ్యూరో: తెలంగాణ జాతికి చెందిన తూర్పు పోడా కోడె ప్రతిమను గురువారం పశు సంవర్ధకశాఖ కార్యాలయ ఆవరణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పశుజాతి నల్లమల అటవీ ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్‌, ఆమ్రాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయన్నారు. దీనిని ఎస్‌బీఏజీఆర్‌ ఇండియా తెలంగాణ స్థానిక జాతిగా గుర్తించిందని చెప్పారు. ఈ పశువులకు ప్రధానంగా తెలుపు చర్మంపై గోధుమ లేదా ఎరుపు మచ్చలు ఉంటాయని, లేదా లేత గోధుమ రంగు చర్మంపై తెల్లని మచ్చలు ఉండి సూటి, పదునైన కొమ్ములను కలిగి ఉంటాయన్నారు.

అన్నికాలాల్లోనూ ఈ పశువులు వ్యవసాయపనులు చాలా సమర్ధవంతంగా చేస్తాయన్నారు. వీటి ఉత్పాదక శక్తి కూడా ఎక్కువని చెప్పారు. ఆవులు క్రమం తప్పకుండా దాని జీవిత కాలంలో 10 కంటే ఎక్కువ దూడలను ఇస్తాయని, ఈ పశువులు మేత తక్కువగా తిని, రోజుకు 20 లీటర్లకన్నాతక్కువ నీరు తాగుతాయని మంత్రి వివరించారు. ఈ పశువులు సుదూర అటవీ ప్రాంతంలోని నీటిని గుర్తించి తాగివస్తాయని, ఎస్‌బీఏజీఆర్‌ ఇండియా గుర్తించిన 151 పశు జాతులలో తూర్పు పోడా పశువు కూడా ఒకటని అన్నారు. పశుసంవర్ధక శాఖలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. 1300మంది గోపాల మిత్రులకు ఒక నెల వేతన భత్యం విడుదల చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.

Next Story

Most Viewed