వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలి : మంత్రి తలసాని

by  |
వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలి : మంత్రి తలసాని
X

దిశ, ముషీరాబాద్ : వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఇందిరాపార్కు వద్ద రైతులకు సంఘీభావంగా ధర్నా నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 2014కు ముందు రాష్ట్రం ఎడారిలా ఉండేదన్నారు. ధాన్యం కొనకపోతే కేంద్ర ప్రభుత్వ పీఠం కదిలిస్తామని తలసాని హెచ్చరించారు. రైతులతో పెట్టుకున్నవారెవరూ ఇప్పటివరకు బతికిబట్ట కట్టలేదన్నారు. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ రాష్ట్రం ఎట్లా ఉండాలనే విజన్‌తో ముందుకు సాగారన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని, కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ముందు చూపుతో మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టి నీటిని ఒడిసి పట్టారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగిందని, పంజాబ్ తర్వాత అత్యధిక వరిని పండిస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అభివృద్ధి చెందినదన్నారు. రైతులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను గుండెల్లో పెట్టుకుని కాపాడుతుంటే, రైతుల నడ్డి విరిచేలా మోడీ సర్కార్ నల్ల చట్టాలను తీసుకొచ్చి వారిని ఆగం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రైతులను కంటతడి పెట్టించిన ప్రభుత్వాలు చరిత్రలో కనుమరుగయ్యాయని స్పష్టంచేశారు. ధర్నా కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ అరెకెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎం.ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, సాయన్న, సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గం ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గం ఇన్చార్జి పుస్తె శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ సింగ్ రాథోడ్, ఎంఎన్ శ్రీనివాసరావు, ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed