త్వరలో పాదయాత్ర చేస్తా.. మంత్రి తలసాని సంచలన ప్రకటన

by  |
Minister Talasani Srinivas Yadav
X

దిశ, బేగంపేట: ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం త్వరలోనే పాదయాత్ర చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తలసాని మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని, పదవులు రాలేదని ఎవరూ నిరాశ చెందొద్దని సూచించారు. పదవుల కోసం కాకుండా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే, పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దసరా లోపు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ‘‘హైదరాబాద్ అంటేనే కేటీఆర్.. కేటీఆర్ అంటేనే హైదరాబాద్’’ అనే విధంగా హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని తలసాని కొనియాడారు. నూతనంగా ఏర్పడే డివిజన్ స్థాయి కమిటీలో ప్రణాళికాబద్ధంగా కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పారు.

త్వరలో తలసాని పాదయాత్ర

సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి పరిధిలోని అన్ని డివిజన్‌లలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే పాదయాత్ర చేస్తానని మంత్రి తలసాని ప్రకటించారు. స్థానిక సమస్యలను ప్రజల నుండి నేరుగా తెలుసుకొని, తక్షణమే పరిష్కరించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, నాయకులు పీఎల్ శ్రీనివాస్, కూన వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, శ్రీహరి ముదిరాజ్, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తెలి గౌడ్, తరణి, శేష కుమారి, డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నరేందర్, నాగమణి, శ్రీనివాస్ గౌడ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed