సార్.. పైసలు సరిపోతలేవ్ : తలసానితో కలెక్టర్

by  |
సార్.. పైసలు సరిపోతలేవ్ : తలసానితో కలెక్టర్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు, బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, మహానగర పాలక సంస్థ కమిషనర్ లోకేష్, అదనపు కమిషనర్ సంతోష్, జిల్లా వైద్యాధికారి వెంకట్రావ్ తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ డిల్లీలో మొహాల్ల క్లినిక్ ల పనితీరును పరిశీలించిన ప్రభుత్వం హైదరాబాద్ లో ఏప్రిల్ 2018లో బస్తీ దవాఖానా పేరుతో 2 దవాఖానాలను ప్రారంభించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్ కు 2 చొప్పున మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో 168 బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 95 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, 2 రోజులలో మరో 10 బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 2200 కమిటీ హాల్స్ ఉన్నాయని, అందులో కొన్ని ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకొనెలా జోనల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేయాలని, కమిటీ హాల్ ల లోనే బస్తీ దవాఖానా లు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు.

అవసరమైన చోట్ల బస్తీ దవాఖానా ల కోసం మొదటి అంతస్తు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. బస్తీ దావఖాన సిబ్బందికి టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని అన్నారు. బస్తీ దవాఖానా లకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రభుత్వం ఆశించిన సత్ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాలలో మౌలిక వసతులు, పర్నిచర్ కోసం లక్షా 30 వేల రూపాయలు ఇస్త్తున్నారని, అవి సరిపోనందున రూ. 2 లక్షలకు పెంచేలా చూడాలని కలెక్టర్ మంత్రిని కోరారు.

Next Story