‘దానికి అనుగుణంగా అర్బన్ హెల్త్ సెంటర్లు’

by  |
‘దానికి అనుగుణంగా అర్బన్ హెల్త్ సెంటర్లు’
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనాభాకు అనుగుణంగా హెల్త్ సెంటర్లు, బస్తీ బస్తీ దవాఖానలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులతో కరోనా వైరస్ వ్యాప్తిపై మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అర్బన్ ప్రాంతాలతో పాటు చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్‌లలో రాపిడ్ యాంటీజన్ కిట్లతో టెస్టులు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. వీటి ద్వారా గంటలోపే ఫలితం వస్తుందని, ఈ కిట్లతో ఇప్పటికే 8 వేల పరీక్షలు జిల్లాలో చేసినట్టు మంత్రి తెలిపారు. ఎక్కువ పరీక్షలు చేస్తునందున కొంచెం ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆసుపత్రుల్లో నిరంతరం కొనసాగుతున్న పరీక్షల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. కందుకూరులో కొనసాగుతున్న కోవిడ్ పరీక్షల కేంద్రంతో పాటు మహేశ్వరంలో కూడా నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పరిధిలో మరో 10 బస్తీ దవాఖానాలతో పాటు మహేశ్వరంలో ఉన్న పీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వీటి మంజూరు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి తెలిపారు. 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేసేలా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ చూపుతున్నారని అన్నారు. పీహెచ్‌సీ బాలాపూర్లో అదనపు గదుల కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మీర్‌పేట్, జిల్లెలగూడాల్లో అర్బన్ హెల్త్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.



Next Story

Most Viewed