ఏ సమస్య వచ్చినా.. వెంటనే ఫోన్ చేయండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by  |
Minister Sabitha Indra Reddy
X

దిశ, జల్‌పల్లి: గులాబ్ తుఫాన్ కారణంగా సోమవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్‌పల్లి పెద్ద చెరువు నిండి అలుగు పారింది. దీంతో ముత్యాలమ్మ దేవాలయం నుంచి వాబే కాలనీ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. వెంటనే అప్రమత్తమైన మున్సిపల్ కమిషనర్ కుమార్, పహాడీషరీఫ్ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కార్గో రోడ్డును మూసి వేశారు. ఈ క్రమంలో రోడ్డు మీద ప్రవహిస్తోన్న వరదనీటిలో చిన్నారులు ఈత కొడుతూ సందడి చేశారు.

పెద్ద చెరువును పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అలుగుపారుతున్న జల్‌పల్లి పెద్ద చెరువును మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుఫాన్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్నటి నుంచే మున్సిపల్ శాఖతో పాటు పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధులు అందరూ అలర్ట్‌గా ఉన్నారన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మణికొండలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

Minister Sabitha Indra Reddy

వర్షాలు పడినప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలు అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో, జల్‌పల్లి మున్సిపల్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. మంత్రి వెంట జల్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అహ్మద్, కమిషనర్ జీపీ కుమార్, కోఆప్షన్ మెంబర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, పాశమ్మ, మాజీ ఎంపీటీసీలు జనార్థన్, శ్రీనివాస్​గౌడ్, షేక్ అఫ్జల్, మాజీ సైనికుడు వాసుబాబు, యూసుఫ్ పటేల్, శ్రీరాం కాలనీ ఎమ్మార్పీఎస్​అధ్యక్షుడు అర్జున్, నాగభూషణం తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed