ధాన్యం కొనుగోలకు పటిష్ట చర్యలు : మంత్రి పువ్వాడ

by  |
ధాన్యం కొనుగోలకు పటిష్ట చర్యలు : మంత్రి పువ్వాడ
X

దిశ‌, ఖ‌మ్మం: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనే పూచి ప్రభుత్వానిదేనని, అందుకు ప్రభుత్వం అన్ని పటిష్ట చర్యలు చేపట్టిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలంలోని పెద్ద‌బీర‌పల్లి, కల్లూరుగూడెం, వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి కరోనా వైరస్ ప్రభావంతో పెను విషాదం ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. రైతులు పండించిన పంటలు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఆపద సమయంలో రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో సూక్ష్మస్థాయిలో విరివిగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఖమ్మం జిల్లాలో 88 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగయింద‌ని, దాదాపు 3లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. 2.34 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగయింద‌ని, సుమారు 8లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే 40లక్షల గన్ని బ్యాగ్స్ వచ్చాయన్నారు. మిగత వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1760 చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, అదనపు కలెక్టర్ మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ నిర్మల, మార్క్‌ఫెడ్ జీఎం సుధాకర్ ఉన్నారు.

tags: Minister Puvvada, opened, grain procurement centers, khammam, formers

Next Story

Most Viewed