ఇది అసెంబ్లీ కాదు.. భట్టికి మైక్ ఇవ్వనన్న పువ్వాడ

by  |
ఇది అసెంబ్లీ కాదు.. భట్టికి మైక్ ఇవ్వనన్న పువ్వాడ
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: మధిర సివిల్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క హాస్యంతో కూడిన ఛలోక్తులు విసురుకున్నారు. సభలో ముందుగా మాట్లాడిన భట్టి విక్రమార్క మధిర సివిల్ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని మంత్రి అజయ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మాట్లాడిన మంత్రి అజయ్ గత ప్రభుత్వాలు వారసత్వాలుగా అనేక సమస్యలను ఇచ్చాయని, పరోక్షంగా కాంగ్రెస్ పాలనను విమర్శించారు. ఈ సమయంలో భట్టి విక్రమార్క నేను మాట్లాడతాను.. మైక్ ఇవ్వాలని, మంత్రిని కోరగా భట్టి గారూ.. మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను.. మళ్లీ మైక్ ఇవ్వటం సాధ్యం కాదు. ఇది అసెంబ్లీ కాదు. అని నవ్వుతూ జవాబు చెప్పారు. దీనికి సభకు వచ్చిన వారు సైతం నవ్వుకున్నారు.

మధిరలో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉంచిన రెమిడెసివిర్ ఇంజెక్షన్స్, ఆక్సిజన్‌తో కూడిన 20 బెడ్లతో ఐసోలేషన్ వార్డును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అంతేకాకుండా మధిర మండలం కృష్ణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయంలో 100 బెడ్స్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్‌ను భట్టి విక్రమార్కతో కలిసి ప్రారభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, డీఎంహెచ్ఓ మాలతి తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed