లాక్‌డౌన్‌తో ‘డబుల్’ ట్రబుల్

by  |
లాక్‌డౌన్‌తో ‘డబుల్’ ట్రబుల్
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పనులు పూర్తికావడంలో జాప్యం జరుగుతోందని రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పూర్తికావడానికి దగ్గర పడిన ఇళ్ళ పనులను వీలైనంత తొందరగా ముగించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రోడ్లు, భవనాల పనుల పురోగతిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగిందని, ఆన్‌గోయింగ్ పనుల్లో వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పల్లెకు నాణ్యమైన రోడ్డు సౌకర్యం ఉండాలని, ఇదే ప్రగతికి చిహ్నమని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు. లక్ష బెడ్‌రూమ్ ఇళ్ళు దసరా పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు అందించాలని కేసీఆర్ భావిస్తున్నారని, ఇప్పటికే అధికారులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారని, ఆ మేరకు పనుల్లో వేగం పెరగాలని వివరించారు. ఇందుకోసం అధికారులంతా కృషి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమై లాక్‌డౌన్ వల్ల పెండింగ్‌లో ఉన్న రోడ్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరగా ఆ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed