పత్తి కొనుగోలుపై మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన

by  |
Minister-Niranjan-Reddy1
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కేంద్రం ధాన్యంపై కిరికిరి పెడుతుందని ముందస్తుగానే శంకించి రెండేళ్లుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ప్రోత్సహిస్తున్నాం… కేసీఆర్ పిలుపు మేరకు రైతులు 10 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారు…భవిష్యత్ లో 20 లక్షల ఎకరాలకు.. పత్తిని 80 లక్షల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్తాం..అందుకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటాం…ఇంటర్నేషనల్ లో డిమాండ్ ఉంది.. సీసీఐతో పనిలేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది… ఇప్పుడు కూడా ఎమ్మెస్పీ కన్నా అధికంగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి’ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంట కోసం రైతు.. రైతుకోసం కేసీఆర్ అని స్పష్టం చేశారు. రైతుల కోసం నిలబడేది టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఎలాంటి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదని వెల్లడించారు. వానాకాలం పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని, వర్షానికి తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. కేంద్రాన్ని నమ్ముకుంటే మోసపోతామని.. తడిబట్టతో గొంతుకోస్తున్నారని.. గత కొన్నేళ్లుగా చూడటమే కాదు.. అనుభవిస్తున్నామని.. అతిక్రూరాతి క్రూరంగా.. కర్కషంగా వ్యవరిస్తుందని మండిపడ్డారు. రైతులపై కేంద్రానికి ప్రేమలేదని, కంటి తుడుపు చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడంలోనూ పేదలపై క్షమాపణలు తప్ప.. హృదయం నుంచి కాదన్నారు. రైతులు కేంద్రం మాటలు నమ్మి మోసపోవద్దని, కష్టపడి పండించి నష్టపోవద్దన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

వానాకాలం పంటపై దిగులు లేదు..కానీ యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల వారీగా రైతుల వేదికల్లో, శిక్షణ శిబిరాల్లో చెబుతున్నామని, సమస్త సమాచారానికి రైతాంగానికి చేరువలో ఉంచామని, క్షేత్రస్థాయిలో ఏఈఓలు అందుబాటులో ఉండి పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నా కేంద్రం వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.



Next Story