అవి తగ్గించి.. ఇవి పెంచండి.. మాట వినాలన్న మంత్రి

by  |
అవి తగ్గించి.. ఇవి పెంచండి.. మాట వినాలన్న మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా దొడ్డు వడ్ల వినియోగం తగ్గడం వలనే ఎఫ్‌సీఐ కొనుగోలును తగ్గించిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు సన్నరకాలనే అధికంగా సాగుచేయాలని సూచించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాల్సిన అవసరముందని తెలిపారు. దొడ్డు బియ్యాన్ని వినియోగించే తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు అక్కడే సాగును పెంచుకుంటున్నాయని వివరించారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే సన్న వడ్ల సాగును పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు చేపడుతుందన్నారు.

రైతులు అధిక లాభాలు పొందాలనే ప్రభుత్వం సూచనలు చేస్తుందన్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు సన్నవడ్ల సాగు పెంచే దిశగా రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. వీటితో పాటు పప్పు ధాన్యాలు, పత్తి, నూనెగింజల సాగుపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు, ఆలుగడ్డ సాగు, ఆలుగడ్డ సీడ్ విత్తనానికి ఉపయోగపడే సాగును అధికారులు పరిశీలించి రైతులను ప్రోత్సహించాలన్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న రైతాంగం కూరగాయల సాగును చేపట్టాలని సలహాలిచ్చారు.

గత వేసవిలో టమాటా దాదాపుగా 6 వేల ఎకరాలలో షేడ్ నెట్‌లో సాగు చేయడం మూలంగా రాష్ట్రంలో మార్కెట్ ధరలు అదుపులో ఉన్నాయని గుర్తుచేశారు. రైతులు ప్రభుత్వ సూచనను పాటించి సాగు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అన్ని రకాలు ఎరువుల నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నారు. మోతాదుకు మించి రైతులు రసాయన ఎరువులు వాడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, తెలంగాణ విత్తనాభివృధ్ది సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్‌లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed