రాష్ట్రంలో నూతన వేరుశనగ వంగడాలు

by  |
రాష్ట్రంలో నూతన వేరుశనగ వంగడాలు
X

దిశ, న్యూ‌స్‌బ్యూరో: ఇక్రిసాట్‌ నూతనంగా అభివృద్ధి చేసిన వేరుశనగ వండాలను రైతాంగానికి అందుబాటులోకి తీసుకువస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తరకం వంగడాలపై ఆసక్తి చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆహార సంస్థలైన మార్స్‌, మాండెలిజ్‌ ఈ ఉత్పత్తులు సేకరించే విధంగా ఒప్పందానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్రిసాట్, ఐసీఎఆర్‌ (భారత జాతీయ వ్యవసాయ పరిశోధనామండలి) సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ వండగడాలు ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. 80శాతం ఓలిక్‌ యాసిడ్‌ ఉండే గిరినార్‌ 4, గిరినార్‌ 5 వంగడాలను మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. రాబోయే యాసంగికి అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు.

సాధారణ వేరుశనగ రకాల్లో ఓలిక్‌ యాసిడ్‌ 40శాతమే ఉంటుందని, దిగుబడి కూడా సాధారణ రకాలకన్నా 60శాతం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. సాధారణ రకాల్లో 40నుంచి 50శాతం నూనె ఉంటే ఈ రకంలో 53శాతం ఉంటుందన్నారు. ప్రతి 115రోజులకు పంట చేతికి వస్తుందని, ఈ నూతన వంగడాలు ఆలివ్‌ ఆయిల్‌లో ఉండే నాణ్యత కలిగి ఉంటాయని చెప్పారు. ఈ రకాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా పెద్ద ఎత్తున రైతాంగం ద్వారా విత్తనాభివృద్ధి సంస్థ సహకారంతో విత్తనోత్పత్తి చేయించాలని ఇక్రిసాట్‌ శాస్త్రవేత్తలు కోరారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఇక్రిసాట్‌ ఆసియా రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూరన్‌ ఎం గౌర్‌, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండి కేశవులు, ఇక్రిసాట్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్టు డాక్టర్‌ జనీలా, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రదీప్‌ పాల్గొన్నారు.



Next Story

Most Viewed