శ్రమిస్తే విజయం తథ్యం- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by  |
శ్రమిస్తే విజయం తథ్యం- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి: పట్టుదలతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వాసంతి దంపతులు సివిల్స్ లో 541వ ర్యాంక్ తో అర్హత సాధించిన పృథ్వీనాధ్ గౌడ్ ను సన్మానించారు. హైదరాబాద్ లోని చైతన్యపురి మారుతీ నగర్ లో నివాసం ఉంటున్న అతని ఇంటికి స్వయంగా వెళ్లి అతనిని అభినందించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వనపర్తికి చెందిన పృథ్వీనాధ్ గౌడ్ సివిల్స్ పరీక్షలో 541వ ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచావని మంత్రి అభినందించారు. ప్రస్తుత పోటీ సమాజంలో నిరంతరం శ్రమిస్తేనే విజయం సాధ్యమని రుజువు చేశావన్నారు. ఎంబీబీఎస్ పూర్తిచేసినా, సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని ప్రజాసేవ చేయాలని భావించడం అందరికీ ఆదర్శమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో పృథ్వీనాధ్ గౌడ్ తల్లిదండ్రులు వనజ, శ్రీనివాస గౌడ్, బంధువులు మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story