మీ రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం : కేటీఆర్

by  |
మీ రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : న్యాయవాదుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకొస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడైనా ఉందో లేదో పరిశీలిస్తామని, ఉంటే దాని విధి విధానాలను అధ్యయనం చేయిస్తామని చెప్పారు. దానికంటే మెరుగైనదాన్ని రూపొందిస్తామని అన్నారు. న్యాయవాదులకు ఏ విధంగా రక్షణ కల్పించాలన్న అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం వైఖరి కఠినంగానే ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తెలంగాణభవన్‌లో మంగళవారం సాయంత్రం లాయర్లతో సమావేశమయ్యారు. వామన్ రావు దంపతుల హత్య జరిగినప్పుడు అందరం భాధపడ్డామని అన్నారు. ఈ హత్య కేసులో స్థానిక టీఆర్ఎస్ నేత ఒకరు ఉన్నారని తెలిసిన వెంటనే పార్టీ నుంచి తొలగించామని గుర్తుచేశారు. హత్యలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారు ఎంతటి స్థాయిలో ఉన్నా వారికి తప్పకుండా కఠిన శిక్ష పడుతుందన్నారు.

ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువరానిది..

రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమంలో లాయర్లు కూడా ఉధృతంగా పోరాడారని కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర, నగరంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గరా, ఇందిరా పార్కు దగ్గరా లాయర్లు చేపట్టిన నిరసనలను మర్చిపోలేదన్నారు. విద్యార్థులకు దీటుగా లాఠీ దెబ్బలు తిన్న సంఘటనలు ఇంకా కళ్లలోనే మెదులుతూనే ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ పోస్టును తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వడానికి అప్పటి పాలకులు సిద్ధపడలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నియమించిందన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం కూడా తీవ్రంగా పోరాడాల్సి వచ్చిందని అన్నారు. వంద రోజులలో అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని బీజేపీ నేతలు రామచందర్ రావు, ప్రకాష్ జవదేకర్ అనేక మాటలు చెప్పారని, చివరకు నిరసనల ద్వారానే ప్రత్యేక హైకోర్టు సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సగటు మనిషికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనేది లాయర్లు ఆలోచన చేయాలని కోరారు.

నిజాలు తెలుసుకోండి..

సోషల్ మీడియాలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ యూనిట్లు వచ్చేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. రామచందర్ రావు చెప్పే మాటల్లో నిజం లేదని, దేశంలో మోడీ ప్రభుత్వం న్యాయవాదులకు చేసిన మంచిపనేంటో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధి కేటాయించిందని, ప్రధాని మోడీ రూ. 10 వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజనలో రాంచందర్ రావు పాత్ర ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు దేశంలో ఎక్కడైనా ఉంటే చూపించాలని రామచందర్ రావుకు కేటీఆర్ సవాల్ విసిరారు. వరంగల్‌లో ఏర్పాటుచేస్తామన్న కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీజిల్- పెట్రోల్ ధరలపై ఆనాడు కాంగ్రెస్‌ను తిట్టిన మోడీ ఇవ్వాళ దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్‌ రోజురోజుకీ బలహీనపడుతూ ఉండడం వల్లనే బీజేపీ ఆటలు సాగుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి గత చరిత్రే తప్ప భవిష్యత్ లేదన్నారు. పీవీ నరసింహారావు చనిపోయిన తర్వాత మృతదేహం కూడా కదలక ముందే కాంగ్రెస్ నాయకులు వెళ్ళిపోయారన్నారు. పీవీకి వందేళ్ల తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవం ఇస్తోందని, శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

Next Story

Most Viewed