దుబ్బాకలో గెలుపు మాదే

by  |
దుబ్బాకలో గెలుపు మాదే
X

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గతానికంటే ఘనమైన మెజారిటీని సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమా లే ప్రజల్లో ఆదరణ పెరగడానికి కారణమని స్పష్టం చేశారు. దుబ్బాకలో తమకు ప్రత్యర్థులే లేరన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు వస్తాయనేది కూడా అనుమానమేనని పేర్కొన్నా రు. దుబ్బాక ప్రజల నాడి తనకు బాగా తెలుసునని, అక్కడి ఓటర్లు ఈ ఎన్నికలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం చెప్తారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఉదయం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నికల సందర్భంగా స్వయంగా తాను దుబ్బాకకు వెళ్ళి ప్రచారం చేశానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈసారి ప్రచారానికి వెళ్లే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా నిర్ణయం తీసుకుంటారని అన్నారు. బీజేపీ సోషల్ మీడియా ప్రచారం వాట్సాప్ యూనివర్సిటీని తలపిస్తో్ందన్నారు. తనకు దుబ్బాక ప్రజల చైతన్యం గురించి బాగా తెలుసని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నందునే ప్రతీ ఎన్నిక‌లో ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీని ఆద‌రిస్తున్నార‌ని గుర్తుచేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, దుబ్బాకలో గెలవాలనే తపనతో బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నిజంగా కేంద్రం నుంచే నిధులు వస్తున్నట్లయితే ఏయే పథకానికి ఎంత నిధులు వస్తున్నాయో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో దొరికిన డబ్బు ఎవరిదో ప్రజలకు స్పష్టంగా తెలుసని, బీజేపీ ఎన్ని రంగులద్దినా ప్రయోజనం లేదని అన్నారు.

మాకు నేర్పాల్సిన పని లేదు

హుందాగా వ్యవహరించడం గురించి టీఆర్ఎస్‌కు ఎవరో నేర్పాల్సిన పనిలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడుతున్న పదజాలం సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందన్నారు. నిజానికి తాము అంతకంటే ఘోరమైన భాషను వాడగలమని, అలా లేనందుకు తమ చేతకానితనంగా భావించరాదన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రధానిమీదా, కేంద్ర మంత్రుల మీదా, బీజేపీమీదా అంతకంటే ఎక్కువ స్థాయిలోనే మాట్లాడతామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని చూసి ఆ పార్టీ నేతలు హుందాగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని హితవు పలికారు.

సీఎం కేసీఆర్ ప్రచారం

దుబ్బాక‌లో సీఎం కేసీఆర్ ప్ర‌చారం మీద ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదని మంత్రి అన్నారు. అవసరం ఏర్పడితే ఆయనే స్వ‌యంగా నిర్ణ‌యం తీసుకుంటార‌న్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం చేయకున్నా భారీ మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. దుబ్బాక‌లో ప్రస్తుతం హరీశ్‌రావు ప్రచారం చేస్తున్నారని, త‌న ప్ర‌చారం అవ‌స‌రం లేద‌నే అనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. తమ ఇద్దరిలో ఎవరు ప్రచారం చేసినా కేసీఆర్ నాయకత్వంలోనే అనేది గుర్తుచేయాల్సిన అవసరం లేదన్నారు. త్వ‌ర‌లోనే పార్టీలోకి మ‌రిన్ని చేరికలు ఉంటాయ‌ని సంకేతాలిచ్చారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు

కరోనా కట్టడిలో తెలంగాణ విఫలం అయిందని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుపట్టారు. ఎన్నో సంస్థ‌లు తెలంగాణ పని తీరును ప్రశంసించాయని గుర్తుచేశారు. క‌రోనా నిర్వహణ కోసం కేంద్రం ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చింద‌ని బండి సంజ‌య్ మాట్లాడుతున్నారని, అది అబ‌ద్ధం అంటూ ఆ పార్టీకి చెందిన కిష‌న్ రెడ్డే నొక్కిచెప్పార‌ని కేటీఆర్ గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణ చాలా నయమన్నారు. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేత‌లు బెంగ‌ళూరు వ‌ర‌ద‌ల గురించి కూడా మాట్లాడ‌తే సంతోషిస్తామన్నారు.

ఆయన లీడరే కాదు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని తాను లీడర్‌గానే గుర్తించడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని ప్రజలెవరూ పట్టించుకోవడంలేదని, సోషల్ మీడియా ద్వారానే ఆయన తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. మొన్న తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతను రేపు ఏ పార్టీలో చేరుతారో తెలియదన్నారు. బీజేపీలోకి వెళ్లిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు చాలా మంది పార్టీలు మారుతారని, రేవంత్ కూడా అందుకు భిన్నమేనీ కాదన్నారు.

మోడీ విఫలం

మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్య‌వ‌స్థ‌ నిర్వహణలో విఫలమైందని కేటీఆర్ చెప్పారు. క‌రోనా రాకముందు నుంచే ఆర్థిక మంద‌గ‌మ‌నం ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు రెండేళ్లుగా ఆర్థిక ప‌రిస్థితి కేంద్రంలో బాగలేదని, క‌రోనాను మాత్రమే కార‌ణంగా చూపడం సహేతుకం కాదన్నారు. ఆర్థిక మందగమనానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌న్నారు.



Next Story

Most Viewed