ప్రభుత్వానికి రెండో ఎజెండా ఏమీ లేదు : కేటీఆర్

by  |
Minister KTR
X

దిశ, సిరిసిల్ల: పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. అర్హులైన ల‌బ్ధిదారుల‌ను గుర్తించి, వారికి జీవ‌నోపాధికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల‌నే ఉద్దేశంతో ప్రభుత్వం పోడు స‌మ‌స్య ప‌రిష్కారానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ తదితర అంశాలపై శ‌నివారం జిల్లా క‌లెక్టరేట్‌లో జిల్లా అధికారుల‌తో, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ స‌మావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 4 లక్షల 72 వేల 329 ఎకరాలు భూమి ఉండగా, అందులో 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉందన్నారు. 2005-06 కేంద్రం ROFR చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. 67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి పోడు భూముల సమస్య పరిష్కరించాలని చూస్తున్నామన్నారు. నవంబర్ 8 నుంచి గ్రామాల వారిగా సదస్సులు నిర్వహించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు పెట్టుకున్న పోడు రైతుల అర్జీలను పరిశీలిస్తామన్నారు. భ‌విష్యత్‌లో ఎలాంటి సమస్య రాకుండా దరఖాస్తు తీసుకొని సమస్య పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. జిల్లాస్థాయిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయాల‌ని, అడవులు అక్రమించకుండా చర్యలు తీసుకోవాల‌న్నారు. పోడు స‌మ‌స్య ప‌రిష్కారంతో పాటు భ‌విష్యత్ త‌రాలను దృష్టిలో పెట్టుకొని అడ‌వులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంద‌ని మంత్రి స్పష్టం చేశారు.

రాజకీయాలకతీతంగా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి రెండో ఎజెండా ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. పోడు స‌మ‌స్యకు ఓ ముగింపు ప‌ల‌కాల‌నే కృత‌నిశ్చయంతో ప్రభుత్వం ఉందని, దీనికి అఖిల ప‌క్ష నేత‌లు కూడా స‌హక‌రించాల‌ని మంత్రి కోరారు. ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో ROFR పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఎంత మందికి, ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించాలనే విషయమై సమగ్ర సమాచారం సేక‌రించాల‌ని, దీనిపై గ్రామ‌, డివిజ‌న‌ల్, జిల్లా స్థాయి క‌మిటీలు క‌స‌రత్తు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. పోడు భూములు, అడవుల సంరక్షణ విష‌యాల‌పై ప్రభుత్వ నిబంధనలు, ROFR యాక్ట్‌లోని అంశాలను తప్పకుండా పాటించాలని ఆయన అధికారులకు సూచించారు.

అటవీ, రెవెన్యూ భూ సమస్యలు ఉన్నచోట రెండు శాఖల జాయింట్ సర్వే చేపట్టి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ROFR చట్టం తెచ్చి గిరిజనులకు హక్కులు కల్పించిందని, గిరిజనేతరుల విషయంలో కేంద్ర చట్టం అడ్డంకిగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి అఖిలపక్షంతో కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ధరణి ప్రవేశపెట్టి, విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన తెలిపారు. త్వరలో డిజిటల్ సర్వే చేపట్టనున్నట్లు, డిజిటల్ సర్వేతో అక్షాంశాలు, రేఖాంశాలతో భూముల విషయంలో ఖచ్చితత్వం వస్తుందన్నారు. పోడు సమస్యలు ఉన్న 67 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ అనంతరం సేకరించిన డాటాతో తిరిగి అఖిలపక్ష సమావేశం నిర్వహించి పారదర్శకంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు వ్యవ‌సాయం చేస్తున్న గిరిజనులు, తదితరుల నుంచి క్లెయిమ్స్ స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో నవంబర్ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ROFR చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప‌ర్యటించి పోడు వ్యవ‌సాయం చేస్తున్న వారి వివ‌రాలు సేక‌రించాల‌ని తెలిపారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. స‌మ‌గ్ర అధ్యయ‌నం త‌ర్వాతే అర్హుల‌కు భూముల‌పై హ‌క్కులు క‌ల్పిస్తామ‌ని మంత్రి తేల్చి చెప్పారు.

Next Story

Most Viewed