కాంగ్రెస్ బీజేపీకి తోక పార్టీ.. ఓ చిల్లర పార్టీ : మంత్రి జగదీష్ రెడ్డి

by  |
Jagadish Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీయూష్ గోయల్ వ్యాపారి… వ్యాపార ప్రతినిధి… ఆయనకు వ్యాపార ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందని, కానీ ఎఫ్‌సీఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని, అందుకే రాత పూర్వకంగా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కూడా బీజేపీకి తోక పార్టీల వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ఓ చిల్లర పార్టీ అని, ఓ నాయకుడు లేడు ఏం లేడు అని మండిపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏ రాష్ట్రంలో లేనిది, తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడుగుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంపై తీసుకుంటున్న చర్యలతోనే గతంలో ఎన్నడూ లేనంతగా పంటపడిందన్నారు. అందుకే అదనపు కొనుగోలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అగ్రిమెంట్ జరిగిందని, మిల్లు పట్టి ఇస్తే, కేంద్రం తీసుకోవాలని కోరారు. అయితే, ఈ టార్గెట్ పూర్తయిందని, ఇంకా మార్కెట్ యార్డుల్లో, పంట కల్లాల్లో, కోతలు ఇంకా పూర్తికాని వరి ఉందని తెలిపారు. ధాన్యం విషయంలో బీజేపీ నేతలు బొక్కబోర్లా పడడం ఖాయమన్నారు. కేసీఆర్ నుంచి రైతాంగాన్ని విడదీయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

రెండ్రోజుల్లో చెబుతామని పీయూష్ గోయల్ చెప్పడంతోనే ఢిల్లీలో ఉన్నామని, లిఖిత పూర్వక హామీ ఇస్తే మేమెందుకు ఢిల్లీలో ఉంటామని.. ఇస్తే వెళ్లిపోయేవాళ్ళం కదా? అన్నారు. రూ. 16,000 కోట్ల కుంభకోణం అంటున్న కాంగ్రెస్ నేతలు.. అసలు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల తప్ప రైతుల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు. ఎవరు రైతుల కోసం పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదని విషయాన్ని తెలంగాణ సమాజం చూస్తోందన్నారు. 40 లక్షల టన్నుల బియ్యానికి ఎంవోయూ చేసినోళ్లు, అదనపు సేకరణపై లెటర్ ఇవ్వడానికి ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదో వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు.

2014 తర్వాత వ్యవసాయం రంగం ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం పక్కదారి పట్టించేందుకు.. ఎన్నికల మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల అంశంలో ఎన్నికలకు ఏం సంబంధం అని, రైతుల నుంచి తన్నులు తప్పించుకునేందుకు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులను శత్రువులుగా చూసే పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పినట్టే లేఖ ఇవ్వాలని అడుగుతున్నామని, ఇచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed