తెలంగాణ హక్కులను కేంద్రానికి ధారాదత్తం చేయాలా..: జగదీష్ రెడ్డి ఫైర్

by  |
తెలంగాణ హక్కులను కేంద్రానికి ధారాదత్తం చేయాలా..: జగదీష్ రెడ్డి ఫైర్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా జలాలపై బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని, తెలంగాణ హక్కులను కేంద్రానికి ధారాదత్తం చేయాలనట్లుగా మాట్లాడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కరించడంలేదని, నదీ జలాలను న్యాయంగా వాడుకోవడంపై ఏపీ సీఎం జగన్‌కు ఎంతో వివేకంతో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని గుర్తు చేశారు.

గోదావరి నదిపై సమస్యలను పక్క రాష్ట్రాలతో సులభంగా తీర్చుకున్నామని, సమస్యలపై పొరుగు దేశాలతో కేంద్రం శాంతి చర్చలు చేస్తోందని, రాష్ట్రాలకు మాత్రం గిల్లీగజ్జాలు ఎందుకని ప్రశ్నించారు. చట్టాల పరిధిలో అందరూ నడుచుకోవాలని, కృష్ణా నదిపై గత అనుమతులతోనే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని వివరించారు. గత తెలంగాణ నాయకులకు ప్రాజెక్టులపై సోయి లేక దశాబ్దాలకు పైగా సాగదీసి ఆంధ్రాకు లాభం చేశారని విమర్శించారు. కేసీఆర్ వచ్చాకే ప్రాజెక్టుల నిర్మాణం పరుగులు పెడుతున్నాయని అన్నారు. జగన్‌కు నీళ్ల విషయంలో స్పష్టత అవసరమని, వృథా నీటిని పద్ధతిగా వాడుకుందామని గతంలోనే కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు.

తెలంగాణా హక్కుల కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ లేదని, అవగాహన రాహిత్యంతో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణా ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రతిపక్షాల వ్యవహారం ఉందన్నారు. నీటి వినియోగంపై వందల ఉత్తరాలు రాసినా కేంద్రం పట్టించుకోవడమేలేదని విమర్శించారు. కొత్తగా వచ్చిన బండి సంజయ్‌కి అవగాహన లేదని, రాజకీయాలు మాని ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికి.. కలిసి రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని ప్రతిపక్షాలు ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.



Next Story