సిద్దిపేట ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్‌రావు

by  |
సిద్దిపేట ఆస్పత్రిని సందర్శించిన మంత్రి హరీశ్‌రావు
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా సందర్శించారు. వైద్యం కోసం అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడారు. ఒకేచోట జనం గుమికూడి ఉండటం గమనించిన ఆయన ఇంత మంది ఎందుకొచ్చారని ప్రశ్నించారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ మేరకు ఆస్పత్రి ప్రాంగణమంతా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.

మిమ్మల్ని మధ్యప్రదేశ్ పంపిస్తా

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కుటుంబాలను మంత్రి పరామర్శించారు. నారాయణఖేడ్ నుంచి రామాయంపేట మీదుగా 10 మంది కాలినడకన మధ్యప్రదేశ్‌కు బయలుదేరారు. వీరిలో సుస్మిత గర్భిణి కావడంతో ఆమెకు వైద్యం అవసరమని తెలుసుకున్న మంత్రి సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆస్పత్రికి వచ్చిన మంత్రికి సుస్మిత తనగోడు వెల్లబోసుకున్నారు. తన కుటుంబ పరిస్థితులు, ఇంటికి వెళ్లకపోతే అత్త, మామ భయాందోళనకు గురువుతారని వివరించారు. మే 7న లాక్‌డౌన్ పూర్తయ్యాక తన ప్రత్యేక వాహనంలో మధ్యప్రదేశ్‌లోని స్వస్థలానికి పంపిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Tags: lockdown, corona, siddipet area hospital, minister harish rao, blood bank

Next Story

Most Viewed