జువ్వాడి రత్నాకర్ రావు.. కడవరకూ తన ప్రాంతం కోసం తపన పడ్డారు : మంత్రి హరీష్ రావు

by  |
జువ్వాడి రత్నాకర్ రావు.. కడవరకూ తన ప్రాంతం కోసం తపన పడ్డారు : మంత్రి హరీష్ రావు
X

దిశ, కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అంత్యక్రియలకు హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.. అతని ఔన్నత్యాన్ని గుర్తుచేశారు. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు పలు హోదాల్లో పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు.. కడవరకూ తన ప్రాంతం కోసం తపన పడ్డారని అన్నారు. తాను నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడు పలుసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పినట్టు తెలిపారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రత్నాకర్ రావు సాధారణ జీవనాన్ని గడిపారని కొనియాడారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జువ్వాడి రత్నాకర్ రావు ఐదు దశాబ్దాలపాటు ప్రజా సేవకే అంకితమయ్యారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. రత్నాకర్ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన పశు వైద్యశాలకు జువ్వాడి రత్నాకర్ రావు పేరు పెట్టాలని కోరారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు :

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. పోలీసుల కవాతు నడుమ ఆయన అంతిమ యాత్ర సాగింది. గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత రత్నాకర్ రావు చితికి అతని కుమారుడు నర్సింగరావు నిప్పంటించారు. జువ్వాడి రత్నాకర్ రావు మరణానికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్‌లోని చల్మెడ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం రత్నాకర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

Next Story

Most Viewed