ముఖ్యమంత్రి కేసీఆర్ దైవంతో సమానం.. మంత్రి గంగుల ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Minister Gangula kamalakar
X

దిశ, కరీంనగర్ సిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ దైవంతోసమానమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కొత్తపెల్లి మండలం కమాన్‌పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి లక్కీ డ్రా ద్వారా మంత్రి కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలోనే మొదటగా కమాన్‌పూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించామని అన్నారు. ఈ ఇండ్లళ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సకల సౌకర్యాలు కల్పించారని తెలిపారు. కమాన్‌పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్ఎండీ ముంపునకు దగ్గరగా ఉన్నాయని, వారికి రిహాబిలిటేషన్ కింద ఇండ్లు కేటాయించామని అన్నారు. 47 మందిలో 36 కుటుంబాలకు ఆదివారం డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించామని, మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అధికారులు అర్హులైన వారికి కేటాయిస్తారని వెల్లడించారు.

మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కమాన్‌పూర్ గ్రామస్తులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ ఆదివారం కుటుంబ సభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు. రాములపల్లి గ్రామస్తులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతనంగా కేటాయించిన ఇండ్లలోకి వెంటనే మారాలని కోరారు. లబ్ధిదారులు వీటిని ఎవరికీ అమ్ముకోరాదని, ఇతరులకు అద్దెకు కూడా ఇవ్వడానికి వీళ్లేదని, అది చట్టరీత్యా నేరం అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రానివారు అధైర్య పడొద్దని అర్హులైన అందరికీ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎలక్ట్రిసిటీ డిఈ రాజిరెడ్డి, ఏడీ రాజు, ఎంపీపీ శ్రీలత-మహేష్, తహసీల్దార్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొనారు.


Next Story