నాలుగైదు రోజుల్లో టిమ్స్ ప్రారంభం: మంత్రి ఈటల

by  |
నాలుగైదు రోజుల్లో టిమ్స్ ప్రారంభం: మంత్రి ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగైదు రోజుల్లో టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం గచ్చిబౌలిలో టిమ్స్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అత్యాధునిక టెక్నాలజీతో టిమ్స్‌ను ఏర్పాటు చేశామని, వెయ్యి బెడ్లకు ఆక్సిజన్, 50 పడకలకు వెంటిలేటర్ల సౌకర్యంతో పాటు వైద్యులు, సిబ్బందికి మంచి క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరోగ్యరంగంలో కేరళ, తమిళనాడుతో పోటీ పడుతున్నామన్న మంత్రి.. జిల్లా స్థాయిలోనూ వెంటిలేటర్లు, ఐసీయూలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

కరోనా లక్షణాలు ఉంటే పీహెచ్‌సీల స్థాయిల్లోనే నమూనాలు సేకరిస్తారని, కరోనాకు ప్రభుత్వ వైద్యంలోనే అన్నిరకాల సేవలను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని, రూపాయి ఖర్చులేకుండా వైద్యం అందిస్తున్నామని అన్నారు. కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని, డబ్బులు మీవైనా పరీక్షలు చేయించుకోవద్దన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో ఏదో జరుగుతుందని దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర చిత్తశుద్ధిని ఎవరూ శంకించొద్దన్నారు.

ప్రాణాలకు తెగించి ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని మంత్రి కొనియాడారు. ఇలాంటి పరిస్థితుల్లో గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. గాంధీలో వేలమందికి ఓపీ సేవలు నడుస్తున్నాయన్నారు. కరోనాతో చనిపోతే అయినవాళ్లే చూసేందుకు దగ్గరకు రావడం లేదని, మనం మనషులమా ! కాదా అన్నది ఆలోచించుకోవాలన్నారు. మృతిచెందిన వారిలో వైరస్ ఉండదని నిపుణులు చెబుతున్నారని అన్నారు. బాధ్యత లేని కొందరు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారి మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.

Next Story