ఆ ముగ్గురిపై ఈటల గురి.. ఆ ఎంపీనే టార్గెట్?

by  |
Minister Etela Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల స్పందించిన తీరులో పరోక్షంగా ప్రభుత్వానికి వార్నింగ్​ఇచ్చినట్లేననే సంకేతాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఉద్వేగభరితంగా.. సానధానంగా మాట్లాడేందుకు ప్రయత్నించిన మంత్రి ఈటల… పరోక్షంగా భారీ సెటర్లు వేశారు. సీఎం కేసీఆర్ మినహా.. ముగ్గురు, నలుగురు కీలక నేతలను టార్గెట్‌గా చేసుకున్నారు. సందర్భోచితంగా మాట్లాడినట్టుగా ఈటల ప్రవర్తించినా… ఈ వ్యాఖ్యలు కొంతమందికి నేరుగా తగిలినట్లు అయిందని పార్టీలో టాక్. ఒక విధంగా మంత్రి ఈటల రాజేందర్ కూడా తనను టచ్ చేస్తే అందరి జీవితాలు బయట పెడుతాననే హెచ్చరికలు పంపించినట్లు చర్చించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ప్రెస్​మీట్‌లోని పలు అంశాల్లో చాలా లోతైన సమాధానాలు, విమర్శలు ఉన్నట్లు అనుకుంటున్నారు.

స్కూటర్‌పై అంటూ ఓ ఎంపీకి చురకలు

మంత్రి ఈటలకు సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలు కొనసాగుతున్నా… ప్రగతిభవన్ చుట్టూ కోటరితోనే పొసగడం లేదు. అందుకే కొంతకాలంగా అటువైపు వెళ్లడమే మానేశారు. ప్రధానంగా సీఎం వ్యక్తిగత అంశాలన్నీ చూసే ఓ రాజ్యసభ ఎంపీని ఈటల టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. ఈటల వ్యవహారంపై సదరు ఎంపీ.. సీఎంకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే ప్రచారం ముందునుంచే ఉంది. ప్రస్తుతం స్కూటర్​మీద తిరిగి వేల కోట్లు సంపాదించలేదంటూ ఈటల.. నేరుగా ఓ తూటానే విసిరారు. అది ఎక్కడ తగులాలో.. తగిలింది అంటూ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.

మరోవైపు అభివృద్ధి ప్రోగ్రామ్స్, ఫార్మా కంపెనీల కోసం భూములు తీసుకుంటున్నారని పరోక్షంగా ఓ కీలకమైన మంత్రిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పరిశ్రమలకు భూ కేటాయింపులపై ఇప్పటికేచాలా ఆరోపణలున్నాయి. కీలకమైన స్థలాల్లో సదరు మంత్రి కోటరీ పాగా వేస్తుందంటూ ఇప్పటికే పలుమార్లు ఎంపీ రేవంత్​రెడ్డి సైతం ఆరోపించారు. కొన్నిచోట్ల పరిశ్రమలు జనావాసాల్లోకి రావడంతో వాటికి వేరేచోట స్థలం కేటాయించి, ఈ స్థలాన్ని తీసుకుని వెంచర్లు చేస్తున్నారంటూ విమర్శలున్నాయి. ప్రగతిభవన్​వేదికగా మరో మంత్రిని టార్గెట్​చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇక చేతికి వాచీ, రేమండ్​గ్లాస్, ఆత్మ గౌరవం అమ్ముకునేవాన్ని కాదంటూ హైదరాబాద్​శివారులోని మరో మంత్రి లక్ష్యంగా మంత్రి ఈటల విమర్శలకు దిగారు. సదరు మంత్రిపై ఇప్పటికే పలు భూ కబ్జాలు, వెంచర్​యజమానులను బెదిరించారనేకేసులు ఉన్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. విచారణ తేలితే మంత్రి పదవిని వదిలేస్తానని, ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదంటూ పరోక్ష సెటైర్లు వేశారు. భూముల వ్యవహారంలోనే పేరొందిన సదరు మంత్రిని కావాలనే హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం.

ఇక పెయిడ్​మీడియా అంటూ పలు మీడియా ఛానళ్లకు కూడా ఈటల పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు చర్చించుకుంటున్నారు. ఓ టీవీ అధినేత ఇప్పటికే హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని భూ వివాదాల్లో ఉండటంతో వారికి కూడా చురకలంటించినట్లు వ్యాఖ్యలు చేశారు. అటు ఓ రాజ్యసభ ఎంపీ మీడియాను చేతిలో పెట్టుకున్నాడంటూ పరోక్షంగా చెప్పుతూనే పెయిడ్​ మీడియా అంటూ విమర్శలకు దిగారు.

ఇలా మంత్రి ఈటల రాజేందర్​ప్రెస్​మీట్ చాలా వర్గాలకు హెచ్చరికలు జారీ చేసినట్టుగానే సాగినట్లు అధికార పార్టీ నేతల్లో టాక్​నడుస్తోంది. ఎందుకంటే కేబినెట్ నుంచి బర్తరఫ్​చేస్తారనే ప్రచారాన్ని అధికార పార్టీ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈటల పరోక్షంగా తానేం చేస్తానో చెప్పకనే చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవరికి సూటిగా తగులుతాయో అదే విధంగా చెప్పుకొచ్చారు. అంటే మంత్రి ఈటల చేతిలో చాలా మంది గులాబీ కీలక నేతల అవినీతి చరిత్ర ఉందన్నట్లుగా సంకేతాలిచ్చారు.



Next Story

Most Viewed