తీన్మార్ మల్లన్నపై మంత్రి ఆగ్రహం

by  |
Minister Allola Indrakaran Reddy
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ లో రూ.40 కోట్లతో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ మంచినీటి రిజర్వాయర్ ట్యాంక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ రాజేందర్ తమ కాలనీ సమస్యలను మంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. తమ కాలనీలో కూరగాయల మార్కెట్లో రోడ్డుపై కూర్చొని విక్రయాలు చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించాలని మంత్రిని కోరారు. అయితే మున్సిపల్ చైర్మన్ గండ్రతు ఈశ్వర్ కలగజేసుకుని.. రాజేందర్ మాట్లాడుతుండగానే మైకు లాక్కునే ప్రయత్నం చేయడంతో సమస్యలు చెప్పవద్దా అని ప్రశ్నించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ట్యాంకు ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రతి ఇంటికి మంచి నీరు అందుతుందని పేర్కొన్నారు. రాబోయే 30 సంవత్సరాల వరకు ఈ ట్యాంకు ద్వారా మంచి నీటిని సరఫరా చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. దీంతో రాబోయే రోజుల్లో మంచి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఇటీవల వర్షాలకు రోడ్లపై నీళ్లు బారిన దృశ్యాలను ‘క్యూ న్యూస్‌’లో ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్నపై మంత్రి మండిపడ్డారు. కేవలం ఎవరో పంపిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద నగరాల్లో సైతం రోడ్లపై నీరు పారుతుందని, అదేవిధంగా సముద్రం పొంగి పొరలినప్పుడు ఎన్నో గ్రామాలు నీటమునిగే అవకాశాలున్నాయని, దానిపై దృష్టి సారించాలని మల్లన్నకు సూచించారు. కొందరు తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని, వీటిని ప్రజలు నమ్మరని, ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు.



Next Story

Most Viewed