ఏలూరులో వింత రోగం..నిండిపోయిన ఆస్పత్రులు

by  |
ఏలూరులో వింత రోగం..నిండిపోయిన ఆస్పత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత రోగం బారిన పడి సుమారు 200 మందికి పైగా ప్రజలు అస్వస్థకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి రాగా, ఆ సమయంలో బాధితుల సంఖ్య 40గా ఉన్న విషయం తెలిసిందే. అయితే క్రమంగా ఈ వ్యాధి బారిన పడి చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అక్కడ బెడ్స్ నిండిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

ఈ వ్యాధి బారిన పడిన వారు నోటిలో నురగలు కక్కుతూ సొమ్మసిల్లి పడిపోతున్నారు. బాధితుల్లో చిన్నారులు సహా యువతీయువకులు, వృద్ధులు కూడా ఉన్నారు. అయితే, ఈ రోగంతో ప్రాణాపాయం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి మాస్ హిస్టీరియాగా మాససిక వైద్యులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. బాధితులకు కరోనాతో పాటు ఇతర వైద్య పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. ఏలూరులోని పడమరవీధి, దక్షిణపు వీధి, గొల్లాయగూడెం, కొత్తపేట, శనివారపుపేట ప్రాంతాల్లో ఈ వ్యాధి బారిన పడి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీలు లేకపోవడంతో అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీరికి వైద్యం అందించేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఏలూరుకు వెళ్లారు.

కాగా, ఏపీ మంత్రి ఆళ్ల నాని ఏలూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. బాధితులను పరామర్శించి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 227 మంది ఈ వ్యాధి బారిన పడగా, అందులో 70 మంది చికిత్స అనంతరం డిశ్చార్చి అయ్యారని మంత్రి వెల్లడించారు. అందరికీ వైద్యం అందిస్తున్నామని, ఎవరూ భయపడవద్దని, ప్రాణాపాయం లేదని బాధితులకు ఆళ్ల నాని భరోసా కల్పించారు. ఇదిలాఉండగా, ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, ఇతర నాయకులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులను అడిగి ఆ వ్యాధి గురించి వివరాలు తెలుసుకున్నారు. బాధిత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.


Next Story

Most Viewed