చదువు చెప్పడం మీ వల్ల కాదు.. మా పిల్లల టీసీ ఇవ్వండి

by  |
చదువు చెప్పడం మీ వల్ల కాదు.. మా పిల్లల టీసీ ఇవ్వండి
X

దిశ, కొత్తగూడ: గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏజెన్సీ ప్రాంతంలోని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గిరిజన గురుకుల పాఠశాలలను నడిపిస్తోంది. అన్ని సదుపాయాలను అందిస్తూ ఏజెన్సీలోని పిల్లలను విజయతీరాలకు చేర్చడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇదిలా ఉండగా, బాధ్యతాయుత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. దీనికి సాధిరెడ్డిపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల అద్దం పడుతోంది. ఈ పాఠశాలలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సాక్ష్యత్తు విద్యార్థులే సమస్యల సాధన కోసం రోడ్డెక్కడం పలువుర్ని ఆలోచనలో పడేసింది.

మా పిల్లలకు టీసీలు ఇవ్వండి

కొత్తగూడ మండలంలోని సాధిరెడ్డిపల్లిలో విద్యార్థులు పడుతున్న అవస్థలు చూసిన ఓ బాలుడి తండ్రి మాట్లాడుతూ.. ‘మా పిల్లలకు టీసీ ఇచ్చేయండి. చదువు చెప్పడం మీ వల్ల కాదు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పిల్లలు స్నానం చేసే పరిస్థితి గతకొద్ది రోజులుగా లేదు. బట్టలు ఉతకడానికి తల్లిదండ్రులు రెండు మూడు రోజులకోసారి పాఠశాలకొచ్చి తీసుకెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. అంతేగాకుండా.. పాఠశాలలో మొత్తం 13 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కానీ, రోజు హాజరయ్యే వారి సంఖ్య చాలా తక్కువని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు సమయపాలన లేకుండా విధులకు హాజరవ్వడం స్టాఫ్‌కి మాములుగా మారిపోయిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే ఇలా నిర్లక్ష్యంగా, ఇష్టారీతిన వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు రోజు వారీగా ప్రత్యేక మెనూ ఉంటుంది. దాని ప్రకారం పిల్లలకు భోజనం అందించాలి. కానీ, ఈ ఆశ్రమ పాఠశాలలో మాత్రం అవేమీ లేవని పిల్లలు ఆరోపిస్తున్నారు. కేవలం పప్పు, చారుతో సరి పెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భోజనం పెట్టడంలో కూడా సమయపాలన లేదని, పొద్దున 9 దాటితే గానీ భోజనం అందట్లేదన్నారు. గుడ్లు, కూరగాయల భోజనం సైతం దూరం చేస్తున్నారని, అడిగిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అందుబాటులో ఉండని వార్డెన్

సాధిరెడ్డిపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చుట్టూ ప్రహారీ గోడ లేదు. ఈ నేపథ్యంలో రాత్రుళ్ళు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ విజయ్ అందుబాటులో ఉండట్లేదని పిల్లలు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం, ఉన్నవి నీళ్ల సమస్య కారణంగా పూర్తి అపరిశుభ్రంగా ఉంటున్నాయి. దీంతో కాల కృత్యాలకు పిల్లలు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే కొత్తగూడ మండలంలో పులి సంచరిస్తోందన్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఇకనైనా వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిపోతే పిల్లలను బడి మాన్పించి ఇండ్లకు తీసుకెళ్తామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉన్నాయి

పాఠశాలలో విద్యార్థులకు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు సమాకూర్చి ఉన్నాయి. ముఖ్యంగా మంచినీరు మిషన్ భగీరథ ద్వారా విద్యార్థులకు సరిపోను వస్తున్నాయి. వృథా చేయకుండా వాడితే ఎలాంటి సమస్య ఉండదు. విచ్చలవిడిగా వాడటం వల్ల అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలలో ప్రత్యేకంగా బోర్లు వేయించి కొరత లేకుండా చర్యలు చేపడతాం. – బానోతు సకుృ, ప్రధానోపాధ్యాయుడు



Next Story

Most Viewed