సామాన్యుడికి LRS టెన్షన్..

by  |
సామాన్యుడికి LRS టెన్షన్..
X

‘నేను తూంకుంటలో 10ఏండ్ల క్రితం రూ.20 వేలు చెల్లించి ప్లాట్ కొన్నాను. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. గతంలో కొనుగోలు చేసిన ప్లాట్‌ క్రమబద్ధీకరణకు ప్రస్తుతం రూ.2 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. దీనివలన ప్లాట్ క్రమబద్ధీకరణకు మరేదైనా ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని తిరుమలగిరికి చెందిన తిరుపతి’ ఆవేదన వ్యక్తం చేశాడు.

దిశ ప్రతినిధి, మేడ్చల్ :

మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు అయింది సామాన్యుల పరిస్థితి. కరోనా నేపథ్యంలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలపై ప్రభుత్వం LRS రూపంలో మోయలేని భారం మోపింది. అక్రమ లే అవుట్లు, రిజిస్ట్రేషన్లు ఇటీవల పూర్తిగా నిలిపివేసి ప్రభుత్వం..మళ్లీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రకటించింది. ఆగస్టు 26వ తేదీ కంటే ముందుగా ప్లాట్లు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఈ స్కీమ్ కింద ఆర్హులని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులతో దినదిన గండంగా బతుకున్న సామాన్యులకు తాజాగా ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న పేదలపై ప్రభుత్వం అదను చూసి ఎల్ఆర్ఎస్ అస్త్రాన్ని ప్రయోగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సామాన్యుడిపై భారం..

శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తునా అక్రమ లే అవుట్లు వెలిశాయి. లే అవుట్లకు సాంకేతిక అనుమతులు తీసుకోకుండానే ఉమ్మడి జిల్లాలో రియల్టర్లు దాదాపు 20 వేలకు పైగా లే అవుట్లు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా వరకు రియల్టర్లు నిబంధనలను తుంగలో తొక్కారు. ప్లాట్లు కొనుగోలు చేసేంత వరకు అన్ని అనుమతులు ఉన్నాయని, కొనుగోలుదారులను నమ్మించి, వాటిని అంటగట్టారు. రియల్టర్ల మోసం తెలుసుకునే లోపే బాధితులు మోసపోయారు. సిరాస్థి ధర పెరుగుతుందని, ఇంటి నిర్మించేప్పుడు/ ప్లాట్ అమ్ముకునేప్పుడు ఎల్ఆర్ఎస్ కడితే సరిపోతుందనుకున్నా.. కొనుగోలుదారులకు సర్కారు నిర్ణయం షాక్‌కు గురిచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు మొత్తం కలిపితే మళ్లీ కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసినట్లేనని సామాన్యులు అవేధన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు దశాబ్దాల క్రితం రూ.10వేలకు కొనుగోలు చేసిన ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధర రూ.లక్ష వరకు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

LRS కోసం పడిగాపులు..

ఎల్‌ఆర్‌ఎస్‌కోసం హెచ్ఎండీఏ కు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికే నెలలు, ఏండ్లుగా పడిగాపులు కాయాల్సి వస్తోంది.హెచ్ఎండీఏ ఉద్యోగుల కొరత వేధిస్తోంది. సరిపడా అధికారులు, సిబ్బంది లేక ఎల్ఆర్ఎస్ జారీలో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 15 వరకే గడువు విధించడం విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను ప్రైవేటు సంస్థలకు అప్పగించినా నిర్ణీత సమయంలో అయ్యేలా కనిపించడంలేదు. ప్రభుత్వ వ్యవస్థలను కాదని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే పెద్ద ఎత్తునా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు

LRSపై పునరాలోచించాలి : ఆర్ .మోహన్ రావు,

కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా సామాన్యుడిపై ఎల్ఆర్ఎస్ చార్జీలను రుద్దడం సరికాదు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు శివారు ప్రాంతాల్లో చాలా మంది అప్పులు చేసి ప్లాటు కొనుగోలు చేశారు. క్రమబద్ధీకరణకు మరోసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలి.


Next Story

Most Viewed