ఎక్స్‌ప్లోరర్ 11లో ‘టీమ్స్‌’కు గుడ్‌బై

by  |
ఎక్స్‌ప్లోరర్ 11లో ‘టీమ్స్‌’కు గుడ్‌బై
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ వీడియో మీట్ యాప్ ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్’ వినియోగదారులకు డెస్క్ టాప్స్, వెబ్‌యాప్స్‌లో టీమ్స్ నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు కాల్ చేసుకునే సౌలభ్యాన్ని ఇటీవలే కల్పించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల కోసం సరికొత్త అప్‌డేట్స్ తీసుకొస్తున్న మైక్రోసాఫ్ట్.. మరింత మెరుగైన సేవలను అందించేందుకు నవంబర్ 30 నుంచి ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 11లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్‌కు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది.

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11లో టీమ్స్ సేవలను నిలిపివేస్తామనే విషయాన్ని 2020 ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే తన వినియోగదారులకు దీని గురించి సూచిస్తూనే ఉంది. ‘టీమ్స్’ ఉపయోగించాలనుకునే వినియోగదారులు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ను ఉపయోగించాలని పేర్కొంది. అయితే ఇదే కాదు.. 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్ 11కు సపోర్ట్ చేయవని కూడా తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ లెగసీ కూడా 9 మార్చి, 2021 తర్వాత పనిచేయదని, దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ కొత్త విండోస్ ఫీచర్ అప్‌డేట్స్‌తో అందుబాటులోకి రానుందని పేర్కొంది.

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఓ క్రాస్ ప్లాట్‌ఫామ్. విండోస్ 10, ఎక్స్ బాక్స్ వన్ కోసం మైక్రోసాఫ్ట్ 2015లో దీన్ని విడుదల చేసింది. 2017లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు ఇది అందుబాటులోకి రాగా, మ్యాక్‌కు 2019లో, లైనెక్స్‌కు 2020లో ఎడ్జ్ బ్రౌజర్ వినియోగంలోకి వచ్చింది. ‘ఎడ్జ్ బ్రౌజర్‌’ కూడా క్రోమ్ బ్రౌజర్‌లానే స్పీడ్‌గా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇక 1995 ఆగస్టులో విడుదలైన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్.. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ అన్న సంగతి తెలిసిందే.


Next Story