రీఎంట్రీతో మైక్రోమ్యాక్స్ సరికొత్త 'ఇన్' బ్రాండ్

by  |
రీఎంట్రీతో మైక్రోమ్యాక్స్ సరికొత్త ఇన్ బ్రాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోకి చైనా స్మార్ట్‌ఫోన్‌లు రాకమునుపు దేశీయ మొబైల్‌ఫోన్ మార్కెట్లో దిగ్గజ బ్రాండ్‌గా పేరున్న దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ తిరిగి భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో చైనా ఉత్పత్తులపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో మైక్రోమ్యాక్స్ తన సరికొత్త వ్యూహాలతో వస్తోంది. నూతన బ్రాండ్ ‘ఇన్’ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు, ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేస్తూ..’ఇన్’ బ్రాండ్‌తో తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని మైక్రోమ్యాక్స్ సీఈవో, సహ-వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు.

ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆయన, మధ్య తరగతి కుటుంబం నుంచి సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడిగా వ్యాపారంలో ఎదిగిన క్రమాన్ని రాహుల్ శర్మ వివరించారు. గతంలో ప్రపంచంలోనే టాప్-10 బ్రాండ్లలో ఒకటిగా ఉన్న ప్రస్తానాన్ని ఆయన గుర్తుచేశారు. తర్వాతి పరిణామాల్లో పొరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారంలో ఓటమిని ఎదుర్కోకపోయినప్పటికీ, సాధించిన విజయం పట్ల సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ పిలుపులో భాగంగా భారత్ కోసం మైక్రోమ్యాక్స్ ‘ఇన్’ బ్రాండ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నామని చెప్పారు.

అలాగే, భారత్‌లో కొత్త ఇన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే క్రమంలో బ్లూ-బాక్స్‌ను రాహుల్ శర్మ వీడియోలో షేర్ చేశారు. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ గురించి ఇతర వివరాలేమీ చెప్పకపోయినప్పటికీ త్వరలో తెలుస్తాయని చెప్పారు. అయితే, ఈ సరికొత్త ‘ఇన్’ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 7 వేల నుంచి రూ. 15 వేల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్ ప్రారంభంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ధరలో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో మళ్లీ పట్టును సాధించేందుకు మైక్రోమ్యాక్స్ సంస్థ సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed