లాక్‌డౌన్ రూల్స్ ఇవే..!

by  |
లాక్‌డౌన్ రూల్స్ ఇవే..!
X

న్యూఢిల్లీ : మే 3వ తేదీ వరకు అమలు కానున్న లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం నిబంధనలు విడుదల చేసింది. లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేసిన తర్వాత రైల్వే, విమాన సేవలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తెలిపినట్టే ఈ నెల 20వ తేదీ తర్వాత కొన్ని రంగాలకు పలు మినహాయింపులనిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయం, ఐటీ, ఈ-కామర్స్, రాష్ట్రాల మధ్య రవాణాకు ఈ నెల 20వ తేదీ తర్వాత అనుమతి ఉంటుందని కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది. అయితే, కరోనా కేసులు నమోదవుతున్న హాట్‌స్పాట్‌లలో మాత్రం ఎటువంటి మినహాయింపుల్లేవు.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే.. !

• గ్రామీణ ఆర్థికాన్ని దృష్టిలో పెట్టుకుని పలురంగాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులనిచ్చింది. రూరల్ ఏరియాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, రోడ్ల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, బిల్డింగ్.. ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు, ఉపాధి హామీ పనులకు అనుమతినిచ్చింది. ఈ మినహాయింపులతో గ్రామీణ ప్రజలకు, వలస కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే, ఇవన్నీ కచ్చితమైన సామాజిక దూరాన్ని పాటిస్తూనే చేయాల్సి ఉంటుంది.

• వ్యవసాయ కార్యకలాపాలు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సహా గుర్తించిన మండీలు, ఇతర పద్ధతుల్లో మార్కెటింగ్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.

• పాల ఉత్పత్తుల సరఫరా, పౌల్ట్రీ, పశు సంపద, టీ, కాఫీ, రబ్బర్ తోటల పనులకు మినహాయింపు ఉంటుంది. సాగుకు సంబంధించిన యంత్రాలు, స్పేర్‌పార్ట్స్‌ విక్రయించే దుకాణాలు, రిపేర్ సెంటర్‌లు తెరిచేందుకు అనుమతినిచ్చింది.

• సెజ్, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, టౌన్‌షిప్పుల్లోనూ ఏప్రిల్ 20వ తేదీ తర్వాత పనులకు అనుమతి ఉంది. అయితే, ఇందులో పనిచేసే కార్మికులకు నివాసం, వారి ప్రయాణ అవసరాల ఏర్పాట్లను యాజమాన్యాలే చేయాలి.

• స్వయం ఉపాధిగా పనిచేసుకునే ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్‌లు, మోటార్ మెకానిక్‌లు, కార్పెంటర్‌లు పనులు చేసుకోవచ్చు.

• డ్రగ్, మెడిసిన్స్ సహా అత్యవసరమైన ఉత్పత్తులను తయారు చేసే యూనిట్‌లకు అనుమతి ఉంటుంది.

• నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, పాల కేంద్రాలు, పౌల్ట్రీ, చేపలు, మాంసం దుకాణాలకు కేంద్రం మినహాయింపు ఇచ్చింది. హైవే దాబాలు, ట్రక్కు రిపేరింగ్ షాపులు, ప్రభుత్వాలకు సంబంధించిన కాల్ సెంటర్‌లకు అనుమతి ఇచ్చింది.

• వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

• అన్ని విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు, ట్యాక్సీలు, క్యాబ్‌ల సేవలపై వచ్చే నెల 3వ తేదీ వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, మత వేడుకులు, మతపరమైన ప్రదేశాలకు అనుమతి లేదు. సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, బార్లు బంద్.

• బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట మాస్క్‌లు తప్పకుండా ధరించాలి. బహిరంగ ఉమ్మివేత నిషేధం. అతిక్రమిస్తే జరిమానాలు సహా శిక్షలుంటాయి.

Tags: lockdown, guidelines, issue, MHA, home affairs, partial, exemptions


Next Story

Most Viewed