ఎంజీ మోటార్ ఇండియా 'గ్లోస్టర్' విడుదల

by  |
ఎంజీ మోటార్ ఇండియా గ్లోస్టర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా గురువారం ప్రీమియం వేరియంట్‌లో ఎస్‌యూవీ గ్లోస్టర్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లాంచ్ చేసిన మొదటి సంవత్సరంలో మొత్తం 6,000 యూనిట్ల గ్లోస్టర్ వాహనాలను అమ్మాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ధరలు కలిగిన ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలోని వాహనాలు ఏటా 30 వేల నుంచి 40 వేల యూనిట్ల అమ్మకాలు జరుగుతాయి.

గ్లోస్టర్ ధర రూ. 28.98 లక్షల నుంచి రూ. 35.38 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య లభించనుందని కంపెనీ వెల్లడించింది. గ్లోస్టర్ డీజిల్ ఇంజిన్‌తో, విలాసవంతమైన 6 సీటర్, 7 సీటర్ కెపాసిటీలో లభించనుంది. ఈ కారును కొనాలనుకునే కస్టమర్లు రూ. లక్ష టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఆన్‌లైన్ లేదంటే, డీలర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ప్రారంభ ఆఫర్ కింద తొలి 2000 మంది కస్టమర్లకు లేదా అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ధరలో లభిస్తాయని, ఇప్పటికే ఈ కారు కొనుగోలుకు బుకింగ్స్ మొదలయ్యాయని కంపెనీ వెల్లడించింది.

ఎంజీ మోటార్ ఇండియా ఈ కారుకు సంబంధించి సుమారు 200కు పైగా యాక్సెసరీస్(ఉపకరణాల)ను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా వినియోగదారులకు సుమారు రూ. 50 వేల విలువైన ఉపకరణాలను ఉచితంగా అందిస్తోంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో లభించనుండగా, సూపర్ వేరియంట్ ఏడు సీట్లను కలిగి ఉంటుంది. స్మార్ట్, సావీ వేరియంట్లలో ఆరు సీట్లు ఉంటాయి. షార్ప్ వేరియంట్ మాత్రం ఆరు, ఏడు సీట్లతో రెండు రకాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అలాగే, సూపర్, స్మార్ట్ వేరియంట్లు 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో దీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. సావీ, షార్ప్ వేరియంట్లు 4 వీల్ డ్రైవ్, 2.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్‌ను అమర్చారు.

Next Story

Most Viewed