సిటీలో ఆర్టీసీ బస్సులు పున:ప్రారంభం?

by  |
సిటీలో ఆర్టీసీ బస్సులు పున:ప్రారంభం?
X

దిశ, న్యూస్‌ బ్యూరో : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 3.0లోనూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పూర్తిస్థాయి ప్రజారవాణాకు మోక్షం దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఆగస్టు ప్రారంభం నుంచి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితికి తగ్గట్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని సినిమా హాళ్లు, జిమ్‌లు ఓపెన్ చేసుకోవడానికి అన్‌లాక్‌ 3.0లో కేంద్ర హోం శాఖ అనుమతి ఇవ్వనుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో మార్చి 22 నుంచి ఆగిపోయిన హైదరాబాద్ నగర ప్రజా రవాణా పునర్ ప్రారంభంపై చర్చ ఊపందుకుంది.

హైదరాబాద్‌ నగరంలో అంతర్గత ప్రజారవాణాలో సింహభాగం వాటా కలిగిన ఆర్టీసీ బస్సులు ఎప్పడు ప్రారంభమవుతాయనే దానిపై టీఎస్ఆర్టీసీ నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. కేంద్రం దేశంలోని నగరాల్లో మెట్రో రైలు, లోకల్ బస్సులు ప్రారంభించవచ్చని ఎప్పుడు మార్గదర్శకాలిస్తే అప్పుడే తాము గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సులు తిప్పుతామని ఆర్టీసీ అధికారులు గతంలోనే తెలిపారు. కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వకుండా ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని చెబితే బంతి రాష్ట్ర సర్కారు కోర్టులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం సిటీ బస్సుల ప్రారంభానికే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని సుమారు 2500 బస్సులు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి చివరి వారం నుంచి డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఒక్క నగరంలోనే రోజుకు రూ.3 కోట్ల దాకా ఆర్టీసీ నష్టపోతోంది.

లాక్‌డౌన్ నుంచి కొన్నింటిని మినహాయించి ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలన్నింటికి కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో ఐటీ లాంటి రంగాల్లో కంపెనీల ఉద్యోగులు చాలా వరకు వర్క ఫ్రమ్ హెం చేస్తున్నప్పటికీ పారిశ్రామిక, రిటైల్ రంగాల ఉద్యోగులు ఇప్పటికీ ఆఫీసులు, పరిశ్రమలకు వెళ్లి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు వ్యక్తిగత వాహనంపైనో లేదంటే ఆటో, ట్యాక్సీలనో ఆశ్రయిస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లు ఎక్కేవాళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది. హైదరాబాద్‌లో అన్నిపరిశ్రమలు, వ్యాపారాలకు అన్‌లాక్‌లో భాగంగా సడలింపులిచ్చి పూర్తిస్థాయి ప్రజారవాణా ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. నగరంలో మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను ప్రారంభించాలని ఆ పార్టీ ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed