కేంద్రం తీరు సరిగా లేదు: మంత్రి ఈటల

by  |
కేంద్రం తీరు సరిగా లేదు: మంత్రి ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు కేంద్రం కావల్సిన సాయం అందించడం లేదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను వెయ్యి వెంటిలేటర్స్‌ కావాలని కోరితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్కే భవన్‌లో అమెరికన్ ఇండియా ఫౌండేషన్, గ్రేస్ పౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రాన్ సంస్థ సభ్యులు మంత్రి ఈటల రాజేందర్‌కు 100 వెంటిలేటర్స్‌ను అందించారు. గాంధీ ఆస్పత్రికి 80, ఉస్మానియాకు 10, చెస్ట్ ఆస్పత్రికి 10 వెంటిలేటర్స్‌ చొప్పున ఇచ్చారు. వీటితో పాటు 5వేల పీపీఈ కిట్స్, 5వేల ఎన్-95 మాస్కులను అందించగా, ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం పడుతుందని, అన్నింటికంటే ముందుగా శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని మంత్రి అన్నారు. ఇలాంటి పేషంట్లకు వెంటిలేటర్స్‌ అత్యవసరమని, అందుకే ఎక్కువ సంఖ్యలో వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మా విజ్ఞప్తిని మన్నించి వెంటిలేటర్స్ తయారు చేసివ్వడానికి ముందుకు వచ్చిన డీఆర్‌డీవోకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పలు ఆస్పత్రుల్లో చిన్న చిన్న సమస్యలతో పక్కన పడేసిన వెంటిలేటర్స్‌ను రిపేర్ చేసి వినియోగిస్తున్నామని, అదేవిధంగా కొత్త వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మైక్రాన్ డైరెక్టర్ రాధిక, మేనేజర్ మురళి, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రామ్ మెనేజేర్ వినయ్ సనం, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ చినబాబు, కిరణ్, గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాజారావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed