మరో విడత పల్లె ప్రగతి : మంత్రి

by  |
మరో విడత పల్లె ప్రగతి : మంత్రి
X

మరో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్ర‌జా ప్ర‌తినిదులు, అధికారులు సిద్ధం కావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్ తదితర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనాలని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ, విధులపై స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి వివరిస్తూ.. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా కలసిగట్టుగా ప‌ని చేయాల‌ని సూచించారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా చేసే భాద్యత చేపట్టాలన్నారు. గ్రామాల వారిగా బడ్జెట్‌ను రూపొందించుకోవాలని సూచించారు. రంగారెడ్డి రెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా, స్వచ్ఛ, ప‌చ్చ‌ని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బడ్జెట్‌లో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.339 కోట్లు ప్రతినెలా సీఎం కేసీఆర్ విడుదలయ్యేలా చేస్తున్నారని తెలిపారు. ప‌ల్లెల‌కు అవసరమైన సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. ట్రాక్టర్ల కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు క‌లెక్ట‌ర్ ప్రతీక్ జైన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story