మోదీ ‘దీపాలు వెలిగించాలని చెప్పడం’వెనకున్న సైన్స్ అదే : కెకె అగర్వాల్

by  |
మోదీ ‘దీపాలు వెలిగించాలని చెప్పడం’వెనకున్న సైన్స్ అదే : కెకె అగర్వాల్
X

దిశ వెబ్ డెస్క్: భారతీయులంతా కలిసి ఏప్రిల్‌ 5న కరోనా వైరస్‌ అనే అంధకారాన్ని తరిమికొట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని మరింత ఘనంగా చాటాలని.. దీని కోసం ఈ ఆదివారం (ఏప్రిల్ 5న) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆపేసి టార్చ్‌, మొబైల్‌ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని దేశ ప్రజలను ప్రధాని కోరుతూ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎవరి ఇంటి గుమ్మం వద్ద వారే జరుపుకోవాలని.. ఎవరూ రోడ్లపైకి రావొద్దని మోదీ సూచించారు. సామాజిక దూరమనే లక్ష్మణ రేఖను ఎవ్వరూ దాటొద్దని అన్నారు. అయితే… చాలా మంది దీనిపై సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ ఈ లైట్లు వేయడం వెనుకున్న అంతరార్థాన్ని, సైన్స్ ను వివరించారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే, ఈనెల 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు మన ఇళ్లలో లైట్లు అన్నీ ఆర్పేసి.. 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు వెలిగించాలని, లేకపోతే మొబైల్ ఫ్లాష్ లైట్లు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఉన్న సైన్స్ గురించి తెలియజేశారు ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్. ‘ప్రధాని మోదీ పిలుపుకి ఓ అర్థం ఉంది. యోగ వశిష్ట చాప్టర్ 6లో ద ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ కాన్షియస్‌నెస్ అని ఉంటుంది. ప్రపంచంలో 5 శాతం మంది ఎలా ఆలోచిస్తారో, 95 శాతం మంది దాన్ని అనుసరిస్తారు. అలాగే, మన శరీరంలోకి కరోనా వైరస్‌ను రానివ్వకుండా చేసే శక్తి మనలోనే ఉంటుంది. క్వాంటమ్ సిద్ధాంతం, రిథంభర ప్రగ్యా ప్రకారం అందరం కలసి ఒక్కటిగా ఆలోచించి, ‘మనకు కరోనా వైరస్ సోకవద్దు’ అని సంకల్పం తీసుకుంటే ఆ కలెక్టివ్ కాన్షియస్‌నెస్ దాన్ని అమలు చేస్తుంది. (ఓరకంగా మనం ఏదైతే జరగాలని బలంగా కోరుకుంటామో అది కచ్చితంగా జరుగుతుంది.)’ అని డాక్టర్ కేకే అగర్వాల్ చెప్పారు. కాబట్టి, ఒకే రోజు ఒకే సమయానికి అందరం కలసి సంకల్పం తీసుకుందామని, ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్టు పాటిద్దామని డాక్టర్ కేకే అగర్వాల్ సూచించారు.

చిరంజీవి మద్దతు:

మోదీ పిలుపునిచ్చిన కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. జనతా కర్ఫ్యూ మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలను కోరుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి పిలుపును ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలను చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మన ప్రియమత ప్రధాన మంత్రి పిలుపును గౌరవిస్తూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దివ్వెలను వెలిగించి కరోనా వల్ల ఏర్పడిన చీకటిని తరిమికొడదాం. మనమంతా ఒక్కటవుదాం, మనం ఒకరికోసం ఒకరం నిలబడతామని పునరుద్ఘాటిద్దాం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

Tags: modi, pm, april 5, lightning, kk agarwal, tweet, science, collective consciousness



Next Story

Most Viewed