మూడున్నరేళ్లుగా నిర్మాణంలో ఉన్న మేడ్చల్ కలెక్టరేట్

by  |
Medchal Collectorate
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. నిర్మాణ పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అర్‌అండ్‌బీ శాఖ, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి ఆఖరిలోగా నూతన కలెక్టరేట్ భవనాన్ని అందుబాటులోకి తేవాలనుకున్నారు. మంత్రి నిర్ణయించిన గడువు ముగిసి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. నిధుల లేమితో పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత కలెక్టరేట్ పరిపాలన విభాగాలు కీసరలోని రెండు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ విభాగాలు ఒకచోట, ఇతర అభివృద్ధి, సంక్షేమ శాఖల కార్యాలయాలు మరోచోట నడుస్తున్నాయి. వీటికోసం నెలనెలా అద్దెల రూపంలో భారీ మొత్తంలోనే చెల్లించాల్సి వస్తోంది.

మూడున్నరేళ్లుగా..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్(సమీకృత భవన సముదాయం)ను శామీర్ పేట మండలంలోని అంతాయిపల్లిలోని సర్వే నెంబర్ 87/పీ పరిధిలోని 30 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 2017, అక్టోబర్ 11న నూతన భవన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాటి పార్లమెంట్ సభ్యుడు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేసింది. కాగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితమే(85 శాతం) రూ.45 కోట్ల మేర పనులు పూర్తికాగా, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇప్పటివరకు పూర్తి చేసిన పనులకు కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని సమాచారం. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం అదనంగా నిధులను కేటాయిస్తే తప్ప ముందుకు సాగే పరిస్థితి కన్పించడం లేదు.

నిధుల లేమీతో నత్తనడకన..

నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనంలో మౌలిక వసతుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అంతర్గత డ్రైనేజీ పైపులైన్ పనులు కొనసాగుతుండగా, విద్యుత్ కోసం ట్రాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. తాగునీటి కోసం సంపు ఏర్పాటు చేయాలి. కార్యాలయాలకు దర్వాజలు, కిటికిలు బిగించాలి. కార్యాలయాల్లో ఫర్నీచర్ సమకూర్చాల్సి ఉంది. భవనం చుట్టూ చెట్లు, ఉద్యానవనం, పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం, మూత్రశాలలు, క్యాంటీన్, భోజన శాల, ఏటీఎం, బ్యాంకు, మీసేవ వంటివి ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్ భవనం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలి. ఇందుకోసం అదనంగా రూ.10 కోట్లు కేటాయించాలని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నయా కలెక్టరేట్ భవన నిర్మాణ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.


Next Story

Most Viewed