ఎంబీబీఎస్ మరింత కష్టం.. ఎగ్జిట్​ పరీక్ష పాస్ అవ్వాల్సిందే

by  |
ఎంబీబీఎస్ మరింత కష్టం.. ఎగ్జిట్​ పరీక్ష పాస్ అవ్వాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్​ మెడికల్ ​కమిషన్ ​కొత్త నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేయడం మరింత కష్టంగా మారనున్నది. అతి త్వరలో ఎంబీబీఎస్ ​కోర్సు పూర్తి చేసిన ప్రతివ్యక్తి నేషనల్ ​ఎగ్జిట్ ఎగ్జామ్​ను రాయాల్సిందేనని ఎన్​ఎంసీ తేల్చి చెప్పింది. దీన్ని 2023 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కేంద్రం సేకరిస్తున్నది. ఎఫ్ఎంజీ(ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్‌) స్థానంలో ఈ పరీక్షను తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటివరకు విదేశాల్లో మెడిసిన్ ​చదివిన వారు మాత్రమే ఈ ఎఫ్​ఎంజీ పరీక్షను రాస్తున్నారు. కానీ ఎగ్జిట్​ పరీక్షను మాత్రం విదేశాలతో పాటు మన దేశంలో ఎంబీబీఎస్​ కోర్సు చదివిన ప్రతివ్యక్తి రాయాలని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఎగ్జిట్​ పరీక్ష రెండు విధానాల్లో ఉండనున్నది. నెక్స్ట్‌ స్టెప్ 1, నెక్ట్స్‌ స్టెప్‌ 2 పేరిట రెండు సార్లు రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదివిన స్టూడెంట్స్‌కు స్టెప్‌ 1 ఎగ్జామ్‌లో అడిషనల్ పేపర్స్ ఉంటాయని ఇటీవల ప్రకటించిన డ్రాఫ్ట్ రూల్స్‌లో పేర్కొన్నది. అంతేకాదు, ఎఫ్‌ఎంజీఈ తరహాలో పాస్ అయ్యేవరకూ ఎగ్జిట్​ను రాసుకునే అవకాశం ఉండదు. ఎంబీబీఎస్ ​పూర్తయిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లో ఈ పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. అంటే, ఐదేండ్ల ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తయిన తర్వాతి రెండేండ్లలో రెండు స్టెప్​ల పరీక్షలు పాస్​ అవ్వాలి. ఇది జరగకపోతే సదరు విద్యార్ధి డాక్టర్ అయ్యే అవకాశం ఉండబోదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఎఫ్​ఎంజీ పరీక్షలో కేవలం 20 శాతం మంది మాత్రమే పాస్​ అవుతున్నారు. కానీ ఎగ్జిట్​ ఎగ్జామ్​ దీని కంటే కఠినంగా ఉంటే ఉత్తీర్ణత శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుందని ప్రోఫెసర్లు అంచనా వేస్తున్నారు.

అప్పుడే రిజిస్ట్రేషన్​…

ఎన్ఎంసీ విధించే ఎగ్జిట్​ పరీక్షలో పాస్ అయితేనే డాక్టర్​గా రిజిస్ట్రేషన్​ పొందడం సాధ్యమవుతుంది. మరోవైపు విదేశాల్లో మెడికల్​ కోర్సు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నది. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్​కు వెళ్లే విద్యార్ధులు ఎన్​ఎంసీ నిబంధనల ప్రకారం ఉన్న కోర్సు, ఇంటర్నిషిప్​, సిలబస్ ​ఉన్న కాలేజీలను ఎంపిక చేసుకోవాలని ఎక్స్​పర్ట్స్ ​చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని దేశాల విద్యార్ధులకు ఎన్​ఎంసీ ఆన్​లైన్​ క్లాసెస్​కు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే తమిళనాడు ఆ విధానాన్ని అమలు చేస్తున్నది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలకు ఇది వర్తించేలా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ఫిలిప్పీన్​, రష్యా, బంగ్లాదేశ్​, వంటి దేశాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మెడికల్​ స్టాండర్ట్స్​ పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు.

ప్రతి ఏటా 5 వేల మంది

మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం సుమారు 4 నుంచి 5 వేల మంది విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్తున్నట్లు మెడికల్​ బోర్డు అధికారులు చెబుతున్నారు. కానీ వారిలో ఎంబీబీఎస్​పూర్తి చేసిన తర్వాత డాక్టర్లుగా కేవలం 20 శాతం మంది మాత్రమే తయారవుతున్నారు. మిగతా వారంతా మన దేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న నేషనల్ బోర్డు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామ్‌ పాస్ కాలేకపోతున్నారు . దీంతో నేషనల్​ మెడికల్​ కమీషన్​ రిజిస్ట్రేషన్​ పొందడం సాధ్యం కాదు. దీంతో ఇతర దేశాల్లో అక్కడ చదివిన ఎంబీబీఎస్​ పూర్తిగా వృథా అవుతున్నది. చేసేదేమీ లేక చివరికి తక్కువ జీతానికి క్లినికల్​ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. అయితే కెనడా, న్యూజిలాండ్‌, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రం ఎఫ్​ఎంజీ పరీక్షకు మినహాయింపు ఉన్నది.



Next Story

Most Viewed